హీరోయిన్ కాకముందు మ్యూజిక్ వీడియోలో నటించిన త్రిష!
on Dec 3, 2020
తెలుగు, తమిళ సినీ ప్రేక్షకుల ఆరాధ్య తారల్లో త్రిష ఒకరు. తన అందచందాలు, అభినయ సామర్థ్యంతో లక్షలాది మంది హృదయాలను ఆమె దోచుకున్నారు. మొత్తం దక్షిణాది సినీ రంగంలోనే అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న అతి కొద్దిమంది తారల్లోనూ ఆమె ముందు వరుసలో ఉంటారు. మహేశ్బాబు, ప్రభాస్, చిరంజీవి, వెంకటేశ్, నాగార్జున లాంటి స్టార్లతో నటించడానికి ముందు ఆమె ఓ మ్యూజిక్ వీడియోలో నటించారనే విషయం చాలా మందికి తెలీదు. 'మేరీ చునార్ ఉడ్ ఉడ్ జాయే' అనే ఆ మ్యూజిక్ వీడియోలో త్రిషతో పాటు ఆయేషా టకియా కూడా నటించింది. అది గాయని ఫల్గుణి పాఠక్ రూపొందించిన వీడియో.
హీరోయిన్గా వెండితెరకు పరిచయమయ్యే నాటికి త్రిష వయసు 18 సంవత్సరాలు. నటి కావాలని ఆమె మొదట అనుకోలేదు. క్రిమినల్ సైకాలజిస్ట్ కావాలనేది ఆమె యాంబిషన్. 1999లో మిస్ సేలమ్, 2000లో మిస్ మద్రాస్, 2001లో మిస్ ఇండియా బ్యూటిఫుల్ స్మైల్ కిరీటాలు గెలుచుకున్న తర్వాతనే ఫిల్మ్ ఇండస్ట్రీలోకి రావాలని త్రిష నిర్ణయించుకున్నారు. కాలక్షేపం కోసం 1999లో 'జోడి' అనే సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్గా నటించిన ఆమె, 2002లో సూర్య సినిమా 'మౌనమ్ పేసియదే'తో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చారు. అక్కడ్నుంచి ఆమె వెనుతిరిగి చూసింది లేదు. 2003లో 'నీ మనసు నాకు తెలుసు'తో టాలీవుడ్కు పరిచయమై, 2004లో ప్రభాస్ సరసన నటించిన 'వర్షం'తో స్టార్ హీరోయిన్ అయిపోయారు. 2010లో అక్షయ్ కుమార్ జోడీగా నటించిన 'ఖట్టా మీఠా'తో బాలీవుడ్లోకీ ఆమె అడుగుపెట్టారు.
'మేరీ చునార్ ఉడ్ ఉడ్ జాయే' మ్యూజిక్ వీడియోను ఓసారి చూస్తే, అప్పటికీ ఇప్పటికీ రూపం విషయంలో త్రిషలో చాలా మార్పు వచ్చినట్లు అనిపిస్తుంది. అందులో ఆమె వైట్ శారీ, ఆర్టిఫిషియల్ దండ ధరించి నటించారు. ప్రస్తుతం ఆమె మణిరత్నం మూవీ 'పొన్నియన్ సెల్వన్' సహా మూడు తమిళ చిత్రాలు, మోహన్ లాల్ సరసన 'రామ్' అనే మలయాళం చిత్రంలోనూ నటిస్తున్నారు.
Also Read