వకీల్ సాబ్ ఆడుతున్న మూడు థియేటర్లకు సీల్!
on Apr 12, 2021
ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లోనే కాదు, ఒడిశా రాష్ట్రంలోనూ పవర్స్టర్ పవన్ కల్యాణ్కు భారీ సంఖ్యలో అభిమానులున్నారు. ఏప్రిల్ 9న విడుదలైన ఆయన లేటెస్ట్ ఫిల్మ్ 'వకీల్ సాబ్' చూసేందుకు వారు అక్కడి థియేటర్లకు విపరీత సంఖ్యలో తరలి వస్తున్నారు. అయితే కొవిడ్-19 నిబంధనలను ఉల్లంఘించడంతో ఒడిశాలో 'వకీల్ సాబ్' ఆడుతున్న మూడు సినిమా హాళ్లను అధికారులు సీల్ చేశారు.
ఒడిశా ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా కరోనావైరస్పై చైతన్యం కలిగించే పలు కార్యక్రమాలు చేపడుతూ, కఠిన నిబంధనలను అమలు చేస్తోంది. అయితే వివిధ ప్రాంతాల్లో జనం ఆ నిబంధనలను ఉల్లంఘిస్తూ వస్తున్నారు. 'వకీల్ సాబ్' ఆడుతున్న థియేటర్లకు అనేకమంది మాస్కులు లేకుండా రావడం, గుంపులు గుంపులుగా తోసుకుంటూ టిక్కెట్ల కౌంటర్ల వద్ద హంగామా చేస్తుండటం, థియేటర్ల యాజమాన్యాలు సైతం కొవిడ్ నిబంధనలను పాటించకపోవడంతో మూడు థియేటర్లను సీజ్ చేశారు.
ప్రాథమిక సమాచారం ప్రకారం గజపతి జిల్లాలోని పర్లాఖిముడిలో జై మా, లక్ష్మి అనే రెండు సినిమా థియేటర్లకు స్థానిక అధికారులు సీల్ వేశారు. తదుపరి ఆదేశాల కోసం వారు ఎదురు చూస్తున్నారు. శుక్రవారం విడుదలైన 'వకీల్ సాబ్' ఆడుతున్న మూడు సినిమా హాళ్లలోని టిక్కెట్ కౌంటర్ల దగ్గర భారీ సంఖ్యలో ప్రేక్షకులు గుమిగూడి, టిక్కెట్ల కోసం తోసుకుంటూ కనిపించారు. వారిని అదుపుచేయడానికి పోలీసులు లాఠీచార్జి కూడా చేయాల్సి వచ్చింది.
పర్లాఖిముడిలోని రెండు హాళ్లతో పాటు రాయగడలోని మరో సినిమా థియేటర్ను కూడా కొవిడ్-19 నిబంధనలను ఉల్లంఘించాయంటూ సీల్ చేశారు. కొవిడ్-19 కేసులు రోజురోజుకూ ఉధృతమవుతుండటంతో, వైరస్ వ్యాప్తిని అదుపుచేయడానికి అధికారులు కఠినచర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగమే ఈ థియేటర్లకు సీల్ వేయడం. శుక్రవారం నుంచి మాస్క్లు ధరించకపోతే తొలి, మలి తప్పుల కింద రూ. 2000 జరిమానా, మూడోసారి కూడా అదే తప్పు చేస్తే రూ. 5000 జరిమానా విధిస్తూ ఒడిశా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.