రజనీకాంత్ ఫ్యాన్స్ చీఫ్ కో-ఆర్డినేటర్గా బీజేపీ మాజీ నేత!
on Dec 3, 2020
అనేక జాప్యాలు, తర్జనభర్జనల తర్వాత ఎట్టకేలకు ఓ ప్రణాళిక ప్రకారం రజనీకాంత్ రాజకీయ రంగ ప్రవేశానికి రెడీ అవుతున్నారు. జనవరిలో తన పార్టీ పేరును ప్రకటిస్తానని గురువారం ఆయన ప్రకటించారు. ఏ రోజు పార్టీని ప్రకటించేదీ డిసెంబర్ 31న తెలియజేస్తానని ఆయన తెలిపారు. 2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తన పార్టీ పోటీ చేస్తుందని చెప్పిన ఆయన, ఆ ఎన్నికల్లో తాము గెలుస్తామనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.
తన నివాసం బయట రిపోర్టర్లతో మాట్లాడిన రజనీ తన ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రధాన సమన్వయకర్తగా "రా అర్జునమూర్తి"ని పరిచయం చేయడం ఆశ్చర్యం కలిగించింది. అర్జునమూర్తి బీజేపీ తమిళనాడు మేధో విభాగం మాజీ అధ్యక్షుడు. ఈ వారమే ఆయన ఆ పార్టీ నుంచి బయటకు వచ్చారు. ఆయనతో పాటు తన రాజకీయ సలహాదారుగా తమిళరువి మణ్యన్ను పరిచయం చేశారు రజనీ. తమిళ రాజకీయాల్లో మణ్యన్ బాగా తెలిసిన వ్యక్తే. రజనీ పార్టీ ఆవిర్భావ కార్యక్రమాన్ని ఆయనే పర్యవేక్షించనున్నారు.
డిసెంబర్ 12న 71 సంవత్సరాలు పూర్తి చేసుకోనున్న సూపర్స్టార్ తమిళనాడులో మార్పు తీసుకురావడమే లక్ష్యంగా తన పార్టీ పనిచేస్తుందని చెప్పారు. తను సక్సెస్ అయితే అది ప్రజల సక్సెస్ అవుతుం
దనీ, అలాగే తాను ఓడితే, అది ప్రజల ఓటమి అవుతుందని ఆయన అన్నారు. "మనం అంతా మార్చేద్దాం. ఇప్పుడు చేయలేకపోతే, ఇంకెప్పుడూ చేయలేం. తమిళనాడు రాతను మార్చడానికి ఇదే సమయం. పాలన మారాలి." అని ఆయన చెప్పారు.
ప్రస్తుతం తాను పనిచేస్తున్న అన్నాత్తే షూటింగ్ పూర్తి చేశాక తన రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభిస్తానని రజనీ తెలిపారు. ఇప్పుడు తాను చెప్తున్న మాటను వెనక్కి తీసుకొనేది లేదని ఆయన తేల్చి చెప్పారు.
Also Read