అక్కినేని హృదయంలో అన్నపూర్ణ స్థానమేంటంటే...
on Oct 29, 2020
చలనచిత్ర పరిశ్రమ అంటే ఒక మాయా ప్రపంచం. మాయల మరాఠీలు, రంగురంగుల సీతాకోకచిలుకలు తిరుగాడే లోకం. ఎంతటి ఆకర్షణీయమైన లోకమో, అంతటి వంచనా ప్రపంచం కూడా. ఏ రంగమైనా మంచి, చెడు మిశ్రమం. అయితే సినిమాల్లో చెడు హైలైట్ అయినట్లు, మంచి హైలైట్ కాదు. అందుకే సినిమావాళ్లతో పెళ్లి సంబంధాలు అంటే భయపడేవాళ్లు ఎక్కువే. అయినప్పటికీ బాలరాజుగా అప్పటికే అమ్మాయిల హృదయాల్ని కొల్లగొట్టిన అక్కినేని నాగేశ్వరరావునే పెళ్లాడుతానని భీష్మించి మరీ పెళ్లాడారు అన్నపూర్ణ. 1949లో ఆమెను పెళ్లాడింది మొదలు 2011 డిసెంబర్లో ఆమె మరణించేంత వరకూ తన హృదయంలో అన్నపూర్ణను దాచుకున్నారు ఏఎన్నార్.
దాదాపు 70 మంది నాయికల సరసన ఆయన నటించారు. వారిలో కొంతమందితో సంబంధాలు అంటగట్టి అన్నపూర్ణ మనసులో విషబీజాలు నాటడానికి ప్రయత్నించి విఫలమయ్యారు కొందరు. ఎవర్ని ఏ విధంగా చూడాలో, ఎవర్ని ఎక్కడ ఉంచాలో ఏఎన్నార్కు బాగా తెలుసు. ఎంతటి అగ్ర నటుడైనా ఆయన బాధ్యత తెలిసిన గృహస్తుడు. ప్రేమానురాగాలు పంచే ఆదర్శవంతుడైన భర్త. షూటింగ్ నుంచి వచ్చాక సాధారణ గృహస్తుగా మారిపోయే ఆయన అన్నపూర్ణతో ఎన్నో విషయాలు చర్చించేవారు. ఆమె చెప్పే విషయాలను శ్రద్ధగా ఆలకించేవారు.
"మేం ఒకరి అభిరుచుల్ని మరొకరం గౌరవించుకుంటాం. ఆత్మీయులుగా, స్నేహితులుగా కలిసిపోతాం" అని ఒక సందర్భంలో అన్నపూర్ణ చెప్పారు. ఆమె కోసం, పిల్లల కోసం, వారితో ఆనందంగా గడపడం కోసం విధిగా ఏడాదికి ఒక నెలరోజులు పూర్తిగా కేటాయించేవారు అక్కినేని. ఆమె పేరిట అన్నపూర్ణ స్టూడియోస్ స్థాపించి అక్కడ షూటింగ్లు చేసుకోవడానికి ఫ్లోర్లు నిర్మించడమే కాకుండా, డబ్బింగ్, రికార్డింగ్ థియేటర్లనూ నెలకొల్పారు. అదే పేరుతో బ్యానర్ను ఏర్పాటుచేసి ఎన్నో చిత్రాలు నిర్మించారు అక్కినేని. వీటి ద్వారా ఎంతో మందికి ఉపాధి కల్పించి, భోజనం పెట్టారు.
వృద్ధాప్యం కారణంగా అన్నపూర్ణ ఆరోగ్యం దెబ్బతిన్నాక నాగేశ్వరరావు సినిమాలు తగ్గించుకున్నారు. అన్నపూర్ణతో గడిపేందుకు ఎక్కువ సమయం వెచ్చించేవారు. 'సకుటుంబ సపరివార సమేతంగా' (2000) సినిమా తర్వాత ఆమెను చూసుకోవడం కోసం ఆయన ఐదేళ్లపాటు సినిమాలకు దూరంగా ఉన్నారంటే భార్యపై ఆయనకున్న అనురాగం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఏదైనా కార్యక్రమంలో పాల్గొనాల్సి వచ్చినా ఒకట్రెండు గంటల కంటే ఎక్కువ సేపు వెచ్చించేవారు కాదు. ఒకవేళ ఎప్పుడైనా కాస్తంత ఎక్కువ సేపు బయట గడపాల్సి వస్తే ఇంటికి వెళ్లేదాకా ఆయన మనసు మనసులో ఉండేది కాదు. అందుకే ఒకసారి, "ఎంతో అరుదైన అదృష్టాన్ని వారి అర్ధాంగిగా పొందగలిగాను. మానసికంగా ఎంతో ఎదగగలిగాను. ఆదర్శ గృహస్తు ధర్మాల గురించి ఆయన్నుంచే ఎవరైనా నేర్చుకోవచ్చంటాను. ఎన్ని సార్లయినా చెబుతాను.. నాకు స్నేహితుడు, గురువు, దైవం అన్నీ ఆయనే." అని సగర్వంగా చెప్పారు అన్నపూర్ణ.
అలాంటి సహధర్మచారణి తనను విడిచిపెట్టి వెళ్లిపోయాక అన్నపూర్ణ స్టూడియోస్లో ఆమె కాంస్య విగ్రహాన్ని ప్రతిష్ఠించారు అక్కినేని. స్టూడియోకు వచ్చిన వాళ్లందరినీ విగ్రహం రూపంలో అన్నపూర్ణ పలకరిస్తున్నట్లే ఉంటుంది. ఆమె పోయిన రెండేళ్లకు "మనసున మనసై బ్రతుకున బ్రతుకై" అంటూ ఆమెను వెతుక్కుంటూ తనూ వెళ్లిపోయారు ఏఎన్నార్.
Also Read