డైరెక్టర్గా మొదటి సినిమా ఓ క్లాసిక్.. మరి రెండో సినిమా?
on Dec 2, 2020
మొదట రచయితగా, తర్వాత నటునిగా లబ్దప్రతిష్ఠులైన తనికెళ్ల భరణి కాస్త లేటు వయసులో రెండే రెండు పాత్రలతో రూపొందించిన మొదటి చిత్రం 'మిథునం' (2012) ఆయనకు విశేష ఖ్యాతిని తెచ్చింది. కమర్షియల్గా భారీ హిట్ కాకపోయినా ఒక క్లాసిక్ను తీశారన్న పేరు సంపాదించుకున్నారు. సీనియర్ రైటర్ శ్రీరమణ రచించిన కథకు భరణి చేసిన తెరానువాదం అత్యుత్తమ స్థాయిలో ఉంది. అప్పదాసు, బుచ్చిలక్ష్మి పాత్రలను ఆయన తీర్చిదిద్దిన విధానం, ఆ పాత్రలను ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, లక్ష్మి పోషించిన తీరు ఈ సినిమాను కళాత్మకం చేశాయి.
ప్రస్తుతం ఆయన దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావును నటుడిగా మార్చి, ఆయన ప్రధాన పాత్రధారిగా ఓ చిత్రాన్ని రూపొందించేందుకు సన్నాహాలు చేస్తున్నారని వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో నాలుగు కాలాల తారలు నటించినున్నట్లు ప్రచారం జరుగుతోంది. రాఘవేంద్రరావు నటుడిగా మారడమే ఓ విశేషమైతే, అందులోనూ ఆయన ప్రధాన పాత్ర పోషించనుండటం ఇంకా విశేషం.
'మిథునం' వచ్చి ఎనిమిదేళ్లు దాటిపోయాయి. ఈలోపు సునీల్ కథానాయకుడిగా 'భక్త కన్నప్ప'ను తీయాలని భరణి సంకల్పించారు. పక్కాగా స్క్రిప్టు కూడా రెడీ చేసుకున్నారు. ఇదివరకే వచ్చిన బాపు 'భక్త కన్నప్ప'కు రీమేక్గా కాకుండా, ధూర్జటి రచించిన 'కాళహస్తి మహత్మ్యం'లోని కథ ఆధారంగా ఆ స్క్రిప్టును ఆయన రాసుకున్నారు. కానీ తర్వాత పరిణామాల్లో ఆ ప్రాజెక్టు ఆగిపోయింది. భరణి నుంచి స్క్రిప్టును మోహన్బాబు తీసుకున్నారనీ, విష్ణు హీరోగా దాన్ని నిర్మించాలని ఆయన భావిస్తున్నారనీ కొంత కాలం క్రితం వినిపించింది.
ఏదేమైనా తన తొలి సినిమా తర్వాత ఎనిమిదేళ్లకు పైగా గ్యాప్ తీసుకొని, రెండో చిత్రాన్ని రాఘవేంద్రరావు ప్రధాన పాత్రధారిగా తీసేందుకు రెడీ అవుతున్నారు భరణి. ఈ సినిమాతోనూ ఆయన దర్శకుడిగా తన ప్రత్యేక్యతను ప్రదర్శిస్తారని ఆశించవచ్చు.