తొలిసారి తెరపై కలిసి నటిస్తున్న కృష్ణారెడ్డి-అచ్చిరెడ్డి!
on Jan 21, 2021
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి, నిర్మాత కె. అచ్చిరెడ్డి ద్వయం గురించి తెలియని సినీప్రియులు ఉండరు. ఆ ఇద్దరూ సినీ కృష్ణార్జునులుగా పేరు తెచ్చుకున్నారు. సన్నిహిత స్నేహితులైన ఆ ఇద్దరూ కలిసి పలు సినిమాలు చేశారు. ఒకప్పుడు అగ్రశ్రేణి దర్శకునిగా రాణించిన కృష్ణారెడ్డి వెండితెరపై 'ఉగాది', 'అభిషేకం' చిత్రాల్లో హీరోగానూ కనిపించారు. అయితే అచ్చిరెడ్డి ఇప్పటివరకూ నటునిగా తెరపై కనిపించలేదు. ఇప్పుడు ఒకేసారి, ఒకే సినిమాలో ఆ ఇద్దరూ కలిసి నటిస్తుండటం విశేషం. ఆ విశేషాన్ని సాధ్యం చేసింది సీనియర్ కమెడియన్ అలీ. ఒకప్పుడు 'యమలీల' సినిమాతో తనను హీరోగా పరిచయం చేసి, బ్లాక్బస్టర్ హిట్ను అందించిన కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి జోడీని తన సొంత సినిమా 'అందరూ బాగుండాలి అందులో నేనుండాలి'లో ఆయన నటింపజేస్తున్నారు. ఈ మూవీలో అలీ, నరేశ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా మొదలైంది.
అలీ మాట్లాడుతూ, "నన్ను హీరోగా ఇంటర్ డ్యూస్ చేసి నా కెరీర్ని కీలక మలుపు తిప్పిన అచ్చిరెడ్డి - కృష్ణారెడ్డిగార్లు నేను నిర్మాతగా మారి తెరకెక్కిస్తున్న 'అందరూ బాగుండాలి అందులో నేనుండాలి'లో నటిస్తుండటం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాలో వారిద్దరి పాత్రలు చిన్నవైనప్పటికీ నా మీద అభిమానంతో నటించడానికి అంగీకరించారు" అన్నారు.
తాజాగా జరిగిన షెడ్యూల్ లో అచ్చిరెడ్డి - కృష్ణారెడ్డి మీద కొన్ని కీలక సన్నివేశాల్ని చిత్ర దర్శకుడు శ్రీపురం కిరణ్ చిత్రీకరించారు. మలయాళం బ్లాక్బస్టర్ మూవీ 'వికృతి'కి తెలుగు రీమేక్గా 'అందరూ బాగుండాలి అందులో నేనుండాలి' తయారవుతోంది. ఈ సినిమాలో యువ నటి మౌర్యానీ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే అధికారికంగా వెల్లడవుతాయి.
Also Read