సుమలతకు కరోనా!
on Jul 6, 2020
రాజకీయవేత్తగా మారిన ఒకనాటి హీరోయిన్ సుమలత కరోనా బారిన పడ్డారు. టెస్టుల్లో ఆమె కొవిడ్-19 పాజిటివ్గా సోమవారం నిర్ధారణ అయ్యింది. శనివారం తనకు తలనొప్పి, గొంతునొప్పి వచ్చినట్లు ఆమె తెలిపారు. తన పనిలో భాగంగా కరోనావైరస్ హాట్స్పాట్స్ను సందర్శిస్తోన్న ఆమె టెస్ట్ చేయించుకున్నారు. "ఈ రోజు రిజల్ట్స్ వచ్చాయి. చాలా చిన్నపాటి లక్షణాలతో పాజిటివ్ అని వచ్చింది. ఇంట్లోనే చికిత్స తీసుకోమన్నారు. హోమ్ క్వారంటైన్లోకి వెళ్లి నా డాక్టర్ సూచనల ప్రకారం చికిత్స తీసుకుంటున్నాను" అని ఆమె తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా తెలిపారు.
దేవుడి దయవల్ల తనలో నిరోధక శక్తి స్థాయిలు బలంగా ఉన్నాయని ఆమె చెప్పారు. "మీ సపోర్ట్తో త్వరలోనే దీన్నుంచి బయటపడతాననే నమ్మకం ఉంది. ఇటీవల నన్ను కాంటక్ట్ అయిన వ్యక్తుల వివరాలను ప్రభుత్వ యంత్రాంగానికి అందజేశాను. ఏవైనా లక్షణాలు కనిపిస్తే, వెంటనే టెస్ట్ చేయించుకోవాల్సిందిగా నన్ను కాంటాక్ట్ అయిన వారిని వేడుకుంటున్నారు. కొవిడ్పై యుద్ధాన్ని గెలుద్దాం" అని ఆమె ట్వీట్ చేశారు.
తెలుగులో పలు చిత్రాలలో హీరోయిన్గా నటించి పాపులర్ అయిన సుమలత కన్నడ టాప్ యాక్టర్ అంబరీష్ను వివాహమాడారు. ఆ తర్వాత కూడా ఆమె నటనకు అవకాశమున్న పాత్రలు చేస్తూ వచ్చారు. అంబరీష్ దివంగతులైన తర్వాత, గత ఏడాది జరిగిన ఎన్నికల్లో ఆయన ప్రాతినిథ్యం వహించిన మాండ్య నియోజకవర్గంలో ఇండిపెండెంట్గా పోటీ చేసిన సుమలత, అప్పటి ముఖ్యమంత్రి కుమారస్వామి కుమారుడు, హీరో నిఖిల్ కుమార్ను భారీ మెజారిటీతో ఓడించారు.