శ్రీదేవి ఫ్యామిలీ సేఫ్!
on Jun 6, 2020
అతిలోక సుందరి, దివంగత నటి శ్రీదేవి ఫ్యామిలీ సేఫ్గా ఉంది. వాళ్లకు కరోనా సోకలేదు. ఈ విషయాన్ని శ్రీదేవి భర్త బోనీ కపూర్ స్వయంగా తెలిపారు. ‘‘కొవిడ్–19 బారినపడ్డ మా వ్యక్తిగత సిబ్బంది ముగ్గురూ పూర్తిగా కోలుకున్నారు. కరోనా పరీక్షలు చేయగా, ‘నెగెటివ్’ అని వచ్చింది. నా కుమార్తెలు జాన్వీ, ఖుషీ సహా నాకూ పరీక్షలు చేయగా ఫలితాలు ‘నెగెటివ్’ అని వచ్చాయి’’ అని బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ సంతోషం వ్యక్తం చేశారు. బోనీ, శ్రీదేవి దంపతుల పెద్ద కుమార్తె జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే.
బోనీ కపూర్ ఇంట్లో పనిచేసే సిబ్బందికి మే నెలలో కరోనా సోకింది. వాళ్లందరూ ఆరోగ్యంగా వైరస్ నుంచి బయటపడడంతో వైద్యులు, ఆరోగ్య సిబ్బంది, పోలీసులు, మహారాష్ట్ర ప్రభుత్వం సహా కేంద్ర ప్రభుత్వానికి బోనీ కపూర్ థ్యాంక్స్ చెప్పారు. ‘‘మా 14 రోజుల హోమ్ క్వారంటైన్ కూడా ముగిసింది. ప్రజెంట్ కరోనా ట్రీట్మెంట్ తీసుకుంటున్నవాళ్లు త్వరగా కోలుకోవాలని మేం ప్రార్థిస్తున్నాం. మిగతా ప్రజలు ప్రభుత్వం సూచించిన జాగ్రత్తలు పాటిస్తూ సురక్షితంగా ఉండాలని అభ్యర్థిస్తున్నాం’’ అని బోనీ కపూర్ పేర్కొన్నారు.
Also Read