అందరికీ నవ్వులు పంచిన మాకు దేవుడు ఇలాంటి దుఃఖాన్ని ఇవ్వవచ్చా?!
on Apr 17, 2021
కోట శ్రీనివాసరావు, బాబూ మోహన్ జోడీ ఎన్ని సినిమాల్లో ప్రేక్షకులను పొట్టచెక్కలయ్యేలా నవ్వించిందో మనకు తెలుసు. ఒకప్పుడు రావు గోపాలరావు-అల్లు రామలింగయ్య జోడీ ఎంత హిట్టయ్యిందో, ఆ తర్వాత అంతగా హిట్టయిన జోడీ ఇదే. తెరపై ఆ జోడీ కనిపించిందంటే యథాలాపంగా మన పెదాలపై నవ్వు విరబూస్తుంది. విధి వైచిత్రి అన్నట్లు ఇద్దరి జీవితాల్లోనూ ఒకే రకమైన విషాదం చోటు చేసుకుంది. అది.. వారి కుమారులు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో మృత్యువాతపడటం. ఆ మృతిలోనూ సిమిలారిటీ ఉండటం కూడా విధి లీల! కోట శ్రీనివాసరావు ఏకైక కుమారుడు కోట ప్రసాద్ రోడ్డు ప్రమాదంలో చనిపోతే, బాబూ మోహన్ పెద్ద కుమారుడు పవన్ కుమార్ సైతం అలాంటి ప్రమాదంలోనే మృతి చెందాడు. ఇద్దరికీ కార్లు ఉన్నాయ్. కానీ బైకు నడుపుతూ ప్రమాదాలకు గురయ్యారు. ఇంకో సిమిలారిటీ ఏమంటే.. వారు బైకు నడుపుతుంటే, వెనకే కారులో వారి కుటుంబసభ్యులు వస్తుండటం!
ఇదే విషయాన్ని బాబూ మోహన్ కొంత కాలం క్రితం ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ సందర్భంగా ప్రస్తావించారు. "కోటన్న వాళ్ల బాబు బైక్ మీద వెళ్తున్నాడు. వెనకాల కారులో భార్య, పిల్లలు ఉన్నారు. యాక్సిడెంటయి చనిపోయాడు. మా బాబు బైక్ మీద వస్తున్నాడు. తను మద్రాస్లో ఇంజనీరింగ్ చదివాడు. అక్కడ్నుంచి అతని బండి పార్శిల్ వచ్చింది. దాన్ని ఇంటికి తెచ్చుకుంటున్నాడు. వెనక స్కార్పియోలో మా చినబాబు ఉన్నాడు. తను స్కార్పియోలోనే రావచ్చు. బైక్ ఎందుకు ఎక్కాడో తెలీదు. ఇక్కడ కోటన్న కొడుకు భార్యా పిల్లలతో హోటల్కు పోతున్నాడు. బైక్ ఎందుకు తీసుకుపొయ్యాడో తెలీదు. రెండూ ఒకే రకమైన యాక్సిడెంట్లు. మా ఇద్దరి జోడీ లాగే మా పిల్లల యాక్సిడెంట్లు సేమ్ టు సేమ్ జరిగాయ్." అని ఆయన చెప్పారు.
తన విషయం కొంచెం బెటర్ అనీ, తన కొడుక్కు ఇంకా పెళ్లి కాలేదనీ అన్నారు. "వారం పదిరోజులైతే పెళ్లి చేసేవాడ్ని. సంబంధాలు చూస్తున్నాను. వాడు చనిపోయిన మూడు నాలుగు రోజులకు ఇల్లు క్లీన్ చేస్తుంటే, వాడి దిండు కింద పెళ్లి సంబంధాలకు చెందిన అమ్మాయిల ఫొటోలు బయటపడ్డాయి. వాటిని ఇచ్చి నీకు ఇష్టమైన అమ్మాయిని సెలక్ట్ చేసుకొమ్మని అడిగాం. రెండు మూడు రోజుల తర్వాత చెప్తానన్నాడు. ఆ రెండు మూడు రోజుల తర్వాత తను లేడు. అదే కోటన్న విషయానికి వస్తే ఆయనకు ఒక్కడే కొడుకు. వాళ్లబ్బాయికి భార్య, ఇద్దరు కొడుకులున్నారు. అదే నాకైతే ఇంకో కొడుకన్నా ఉన్నాడు. కొడుకు అలా చనిపోవడాన్ని కోటన్న తట్టుకోవడం సామాన్య విషయం కాదు. మాకే ఇలా ఎందుకు జరగాలి? అందరినీ నవ్వులు పంచాం. అలాంటి మాకు దేవుడు ఇలాంటి దుఃఖాన్ని ఇవ్వవచ్చా?" అని ఆవేదనగా ప్రశ్నించారు.