స్టార్ హీరోలకు కూడా ఓటీటీలే గతి!
on Jul 14, 2020
మరో సంవత్సరం దాకా సినిమా థియేటర్లు తెరుచుకోవని అంతర్జాతీయ ఖ్యాతి గడించిన ఇండియన్ డైరెక్టర్ శేఖర్ కపూర్ అంచనా వేస్తున్నారు. తొలి వారం సినిమా రూ. 100 కోట్ల బిజినెస్ చేయడమనే హైప్ ఇక చచ్చిపోయినట్లేననీ, దాంతో పాటు స్టార్ సిస్టమ్ కూడా చచ్చిపోతుందనీ ఆయన అంటున్నారు. మంగళవారం తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా ఆయన పోస్ట్ చేసిన ఈ అంశం ఇండస్ట్రీలో సర్వత్రా చర్చకు దారి తీసింది.
"థియేటర్లు కనీసం ఇంకో ఏడాది దాకా తెరుచుకోవు. కాబట్టి ఫస్ట్ వీక్ రూ. 100 కోట్లకు పైగా బిజినెసట్ అంటూ జరిగే హైప్ చచ్చిపోతుంది. దానికి తగ్గట్లే థియేట్రికల్ స్టార్ సిస్టమ్ చనిపోతుంది. స్టార్లు ప్రస్తుతం ఉన్న ఓటీటీ ప్లాట్ఫామ్లోకి రావాల్సిందే. లేదంటే తమ సొంత యాప్ల ద్వారానైనా సినిమాలు రిలీజ్ చేసుకోవాలి. టెక్నాలజీ చాలా సులభతరమైపోయింది" అని శేఖర్ కపూర్ ట్వీట్ చేశారు.
ఈ ట్వీట్కు ఆర్జీవీ మాస్టారు స్పందించారు. "ఒక యుగానికి డూమ్స్డే జోస్యం లాగా వినడానికి ఇది చాలా బాగుంది" అని ఆయన రిప్లై ఇచ్చారు. ఏదేమైనా శేఖర్ కపూర్ చేసిన ట్వీట్ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన అందరిలోనూ దడ పుట్టించింది. థియేటర్లు తెరుచుకోకపోతే వేలాది మంది కాదు, లక్షలాది మంది రోడ్డున పడటం ఖాయం. అయితే చాలామంది మాత్రం డిసెంబర్ లోగా అందరికీ అందుబాటులోకి కరోనా వ్యాక్సిన్ వచ్చేస్తుందనీ, అప్పుడు దానికి భయపడాల్సిన పని ఉండదు కాబట్టి థియేటర్లు తెరుచుకుంటాయనీ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
మిస్టర్ ఇండియా, బాండిట్ క్వీన్, ఎలిజిబెత్, ద ఫోర్ ఫెదర్స్, పాసేజ్ వంటి సినిమాల డైరెక్టర్గా శేఖర్ కపూర్ అంతర్జాతీయ ఖ్యాతి గడించారు. 'విశ్వరూపం' సహా కొన్ని సినిమాల్లో కీలక పాత్రలు చేశారు.