హైదరాబాద్లో శాశ్వతంగా మాయమవుతున్న పలు సినిమా హాళ్లు!
on Dec 2, 2020
మార్చి 25 నుండి లాక్డౌన్ కారణంగా మూసివేతకు గురైన థియేటర్లో చాలా వరకు ఇంకా తెరుచుకొనే లేదు. హైదరాబాద్లో డిసెంబర్ 4 నుంచి మల్టీప్లెక్సులు తెరుచుకుంటున్నాయి. మిగతా చోట్ల కూడా థియేటర్లను ఓపెన్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అయితే లాక్డౌన్ వల్ల మూసివేయడంతో తీరని నష్టాల్లోకి వెళ్లిపోయిన సింగిల్ స్క్రీన్ థియేటర్లను మళ్లీ తెరవడానికి వాటి యజమానులు సిద్ధంగా ఉన్నట్లు కనిపించడం లేదు. హైదరాబాద్లో కనీసం పది సినిమా హాళ్లు శాశ్వతంగా కనుమరుగవడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.
ఇప్పటికే ఆర్థిక భారాన్ని తట్టుకోలేక, వాటిని మెయిన్టైన్ చేసే శక్తిలేక ఆరు హాళ్లను పూర్తిగా మూసేయడానికి నిర్ణయం తీసుకున్నారు. అవి.. దిల్సుఖ్ నగర్లోని మేఘ థియేటర్, వనస్థలిపురంలోని సుష్మ థియేటర్, నారాయణగూడలోని శాంతి థియేటర్, బహదూర్పురలోని శ్రీరామ, ఆర్టీసీ క్రాస్రోడ్స్లోని శ్రీమయూరి, మెహదీపట్నంలోని అంబా థియేటర్లు. వీటిని గోడౌన్లు లేదా మరో కమర్షియల్ ప్రయోజనాల కోసమో లీజుకు ఇవ్వడానికి వివిధ కంపెనీలు సంప్రదింపులు జరుపుతున్నాయంటున్నారు. మరికొన్ని థియేటర్లను కమర్షియల్ కాంప్లెక్సులుగా మార్చడానికి వాటి యాజమాన్యాలు నిర్ణయించుకున్నాయి. దిల్సుఖ్ నగర్లోని వెంకటాద్రి థియేటర్, టోలిచౌకిలోని గాలక్సీ థియేటర్ల అలా కమర్షియల్ కాంప్లెక్సులుగా మారనున్నాయి. గూగుల్ ప్రకారం శాశ్వతంగా మూతపడిన థియేటర్లుగా ఇవి దర్శనమిస్తున్నాయి.
ఈ సింగిల్ స్క్రీన్ థియేటర్లన్నీ పెద్ద స్టార్ల సినిమాలు రిలీజైనప్పుడు ఎంత సందడిగా కనిపించేవో సినీ ప్రియులందరికీ తెలిసిందే. తమ హీరోల కటౌట్లను ఏర్పాటుచేసి, వాటిని పూలమాలతో అలంకరించి, అభిమానులు చేసే హంగామా పండగ వాతావారణాన్ని గుర్తు చేసేది. ఇకనుంచీ ఆ సందడి, ఆ కోలాహలం ఆ థియేటర్ల దగ్గర పూర్తిగా మాయమవనున్నది. కేవలం పాత స్మృతులుగా అవి మారిపోనున్నాయి. అమెజాన్ లాంటి కంపెనీలు, మోర్, స్పెన్సర్స్, రిలయన్స్ ఫ్రెష్ లాంటి బ్రాండెడ్ సూపర్ మార్కెట్లు ఈ థియేటర్లను లీజుకు తీసుకోవడానికి సంప్రదింపులు జరుపుతున్నట్లు ఫిల్మ్నగర్లో ప్రచారం జరుగుతోంది.
50 శాతం ఆక్యుపెన్సీతో రన్ చేయడం శుద్ధ దండగ అనీ, దాని వల్ల నష్టాలే తప్ప లాభాలు ఉండవనీ థియేటర్ల యజమానులు అభిప్రాయపడుతున్నారు. అందుకే వాటిని కమర్షియల్ కాంప్లెక్సులుగా మార్చడమో, లేక వేరే కంపెనీలకు లీజుకు ఇవ్వడమో చేయడానికి వాళ్లు సిద్ధమవుతున్నారు.
Also Read