దేవా కట్టా డైరెక్షన్లో మెగా హీరో 'రిపబ్లిక్'!
on Jan 25, 2021
దేవా కట్టా డైరెక్షన్లో సాయితేజ్ హీరోగా ఓ మూవీ రూపొందనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి 'రిపబ్లిక్' అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ మూవీలో సాయితేజ్ జోడీగా ఐశ్వర్యా రాజేశ్ నటిస్తోంది. జె.బి. ఎంటర్టైన్మెంట్స్, జీ స్టూడియోస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా షేర్ చేసిన పోస్ట్లో ఈ మూవీకి రిపబ్లిక్ టైటిల్ అని ఖరారు చేసినట్లు సాయితేజ్ తెలిపాడు.
"And my next is "REPUBLIC" "రిపబ్లిక్". A mighty proud project for me. Humbled to be the face of @devakatta 's vision." అంటూ అతను ట్వీట్ చేశాడు. దాంతో పాటు రిపబ్లిక్ మోషన్ పోస్టర్నూ అతను షేర్ చేశాడు. అందులో, "యువరానర్.. ప్రజలెన్నుకున్న రాజకీయ నాయకులు, శాసనాల్ని అమలు చేసే ప్రభుత్వోద్యోగులు, న్యాయాన్ని కాపాడే కోర్టులు.. ఈ మూడు గుర్రాలూ ఒకరి తప్పులు ఒకరు దిద్దుకుంటూ క్రమబద్ధంగా సాగినప్పుడే ఇది ప్రజాస్వామ్యమవుతుంది, ప్రభుత్వమవుతుంది. అదే.. అసలైన రిపబ్లిక్." అంటూ సాయితేజ్ వాయిస్ ఓవర్ వినిపించాక 'రిపబ్లిక్' టైటిల్ ప్రత్యక్షమయ్యింది.
సాయితేజ్ నటించగా లాక్డౌన్ తర్వాత థియేటర్లలో విడుదలైన తొలి సినిమాగా 'సోలో బ్రతుకే సో బెటర్' మూవీ పేరు తెచ్చుకుంది. 50 శాతం ఆక్యుపెన్సీలోనూ దానికి చెప్పుకోదగ్గ రీతిలో వసూళ్లు వచ్చాయి.