రఘురామ కృష్ణంరాజును సింహం అన్న ఆర్జీవీ.. ట్రోల్ చేస్తోన్న జగన్ ఫ్యాన్స్!
on Jul 1, 2020
'కమ్మరాజ్యంలో కడపరెడ్లు' పేరుతో సినిమా తీసి, ఆ టైటిల్తో సినిమా విడుదలకు కోర్టు అంగీకరించకపోవడంతో, చేసేది లేక 'అమ్మరాజ్యంలో కడపబిడ్డలు'గా టైటిల్ మార్చి విడుదల చేసిన రామ్గోపాల్ వర్మ.. ఆ టైమ్లో ఇచ్చిన ఇంటర్వ్యూల్లో తనకు క్యాస్ట్ ఫీలింగ్ ఉందని అంగీకరించాడు. "నాకు క్యాస్ట్ ఫీలింగ్ ఉందనేది నిజం. కానీ నాకు క్యాస్ట్ ఫీలింగ్ కమ్మోళ్ల మీద ఉంది. రాజుల మీద కాదు. కమ్మోళ్లంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే వాళ్లు అసలు రాజుల్లాగా ఉంటారు. వాళ్ల దర్పం అదీ చూస్తుంటే రాజుల్లాగా ఫీలవుతున్నట్లుంటారు. అందుకే కమ్మోళ్లంటే క్యాస్ట్ ఫీలింగ్ ఉంది. అది అసలైన నిజం" అని ఆయన చెప్పాడు.
ఇప్పుడు వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు తన పార్టీ నేతలపైనే నిరసనల గళం వినిపించడం, దాంతో ఆయనకు పార్టీ షోకాజ్ నోటీస్లు జారీచేయడం, అయినా వెనక్కి తగ్గని ఆయన ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి లేఖ రాయడం వంటి విషయాలు గమనించిన ఆర్జీవీ.. ఆయనకు మద్దతు నివ్వడం చర్చనీయాంశంగా మారింది. చంద్రబాబునాయుడునూ, ఆయన పార్టీ తెలుగదేశంను అపహాస్యం చేసేలా, జగన్మోహన్రెడ్డినీ, ఆయన పార్టీ వైసీపీని మెచ్చుకొనేలా సినిమా తీసి, జగన్ మద్దతుదారుగా ముద్రపడిన వర్మ ఇప్పుడు రఘురామ కృష్ణంరాజును హీరో అనీ, సింహం అనీ కీర్తించడం వైసీపీ నేతలనూ, జగన్ అభిమానులనూ ఆశ్చర్యంతో పాటు, ఆగ్రహానికీ గురిచేసింది.
"నాకు రాజు (కుల) ఫీలింగ్ లేదు. కానీ కచ్చితంగా రఘురామ కృష్ణరాజు ఫీలింగ్ ఉంది. ఎందుకంటే అతను నిజానికి సింహం, ధైర్యానికి పులి.. అందుకే అతను హీరో. సింహం ఒక్కటే సింగిల్" అని ట్వీట్ చేశాడు రామ్గోపాల్ వర్మ. దీంతో ఆయనను ట్రోల్ చేస్తూ అనేక కామెంట్లు వస్తున్నాయి. వైసీపీ, జగన్ అభిమానులు వర్మ తీరుపై అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు.
రాజేష్రెడ్డి అనే అతను, "మూసుకుని పోరా బూతు సినిమాలు తీసే వర్మగా.. మొదట్లో ఇష్టం వచ్చినట్లు మాట్లాడి, తరువాత షోకాజ్ నోటీసులు పంపాక తిరిగి తోక ముడుచుకొని జగన్ అన్నకి క్షమాపణలు చెప్పాడు (రఘురామకృష్ణంరాజు). ఎలా అంటాడురా వాడిని HERO అని. చెప్పు. Cast feeling లేదు అని ఇంత కాస్ట్ ఫీలింగ్ తో మాట్లాడుతున్నావు" అని ఏకిపారేశాడు. కె. రాంరెడ్డి అనే ఇంకొకతను "సింహం సింగల్ గా వస్తూంది కానీ సింగల్ గా వచ్చిన ప్రతీది సింహం కాలేదు. గజ్జి కుక్క కూడా సింగలే ఎవరూ దగ్గరికి రానివ్వరు కాబట్టి అంత మాత్రాన అది సింహం అన్నట్టు కాదు" అని కామెంట్ పెట్టాడు.
సాధారణంగా వర్మ పెట్టిన ట్వీట్స్ను ట్రోల్ చేసేవారికంటే, ఆయనను సమర్థిస్తూ కామెంట్లు పెట్టేవాళ్లే ఎక్కువ. కానీ ఇప్పుడు ఆర్జీవీ ఫ్యాన్స్పై జగన్ ఫ్యాన్స్ పైచేయి సాధించినట్లు కనిపిస్తోంది. అందుకే వర్మను ట్రోల్ వర్షంలో ముంచెత్తుతున్నారు.