'ఎంటర్ ద గాళ్ డ్రాగన్' అంటున్న ఆర్జీవీ
on Nov 26, 2019
రాంగోపాల్ వర్మ ఎప్పుడు ఏం తీస్తాడో, ఎప్పుడు ఎవర్ని ఇండస్ట్రీకి పరిచయం చేస్తాడో.. ఎవరికీ తెలీదు. చప్పున ఒక రోజు ఫలానా సినిమా, ఫలానా కథతో తీస్తున్నానని చెప్పి ఆశ్చర్యపరుస్తూ వస్తుంటాడని మాత్రం మనకు తెలుసు. నిన్నటి 'లక్ష్మీస్ ఎన్టీఆర్' కానీ, నేటి 'కమ్మరాజ్యంలో కడపరెడ్లు' కానీ.. ఆ విషయమే చెబుతాయి. తాజాగా 'ఎంటర్ ద గాళ్ డ్రాగన్' అనే సినిమాని డైరెక్ట్ చేస్తున్నాననీ, ఇండో చైనీస్ భాగస్వామ్యంతో ఈ సినిమా నిర్మాణమవుతోందనీ వెల్లడించి మరోసారి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేశాడు వర్మ. ఆ మూవీని ఆయన భారతదేశపు తొలి మార్షల్ ఆర్ట్స్ ఫిలింగా అభివర్ణించాడు. అంటే, ఇప్పటిదాకా మనదేశంలో మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో అసలు సినిమాలు రాలేదా? అని ఆశ్చర్యపోవడం మనవంతు. బ్రూస్ లీ 80వ జయంతి సందర్భంగా నవంబర్ 27న, ఆయన జన్మించిన క్షణాలు మధ్యాహ్నం 3:12 గంటలకు టీజర్ రిలీజ్ చేస్తున్నానని ఆయన ప్రకటించాడు.
అంతేనా? 'ఎంటర్ ద గాళ్ డ్రాగన్' ఇంటర్నేషన్ ట్రైలర్ డిసెంబర్ 13న చైనాలో బ్రూస్ లీ స్వస్థలం ఫోషన్ సిటీలో రిలీజవుతుందనీ వర్మ వెల్లడించాడు. ఈ సందర్భంగా సినిమాలో ఒక యాక్షన్ స్టిల్ని కూడా ఆయన తన ట్విట్టర్ పేజీలో పొస్ట్ చేశాడు. అందులో ఒక దుండగుడిని 'గాళ్ డ్రాగన్' కాలితో కిక్ ఇస్తూ కనిపిస్తోంది. ఆ గాళ్ డ్రాగన్ ఎవరనేది వర్మ తెలుపలేదు. మొత్తానికి బ్రూస్ లీకి వర్మ అందిస్తున్న నివాళిగా 'ఎంటర్ ద గాళ్ డ్రాగన్'ను చెప్పుకోవచ్చు. ముంబైకి చెందిన పూజ అనే యువతి టైటిల్ రోల్ చేస్తోందని సమాచారం. మార్షల్ ఆర్ట్స్లో బాగా శిక్షణ ఇప్పించి ఆమెతో ఈ సినిమాని ఆయన తీస్తున్నాడు.
Also Read