ప్రతీకారం కోరుకుంటే ఎదగలేం: రామ్చరణ్
on Jul 6, 2020
రామ్చరణ్ సోషల్ మీడియాలో తరచుగా కాకపోయినా అప్పుడప్పుడు పోస్టులు పెడుతుంటాడు. కొన్ని ముఖ్య సందర్భాల్లో, తన భావాలను పంచుకోడానికి ఇన్స్టాగ్రామ్ లేదా ట్విట్టర్లో యాక్టివ్ అవుతుంటాడు. అంతేకాదు, తన సన్నిహిత స్నేహితులు, కుటుంబ సభ్యుల పుట్టినరోజులకు శుభాకాంక్షలు చెపుతుంటాడు. ఎవరైనా ఏదైనా చాలెంజ్ విసిరితే, దాన్ని టేకప్ చేసి షేర్ చేస్తుంటాడు.
అయితే ఆదివారం సాయంత్రం అతను షేర్ చేసిన పోస్ట్ చాలామందిని ఆశ్చర్యానికి గురిచేసింది. అందులో 'వినయ విధేయ రామ' షూటింగ్ సందర్భంగా అజర్బైజాన్ వెళ్లినప్పుడు తీసిన రెండు ఫొటోలను షేర్ చేశాడు. ఆ ఫొటోలకూ, అతను పోస్ట్ చేసిన విషయానికీ సంబంధమేంటో తెలీదు. హంగేరియన్ రచయిత్రి ఎడిత్ ఇవా ఎగర్ ప్రఖ్యాత పుస్తకం 'ద చాయిస్'లోని "హింస లేదా అహింస.. మార్గం ఏదైనా, ప్రతీకారం కోరుకుంటే మనం ఉన్న చోట స్తంభించిపోతాం తప్ప ఎదుగుదల ఉండదు." అనే మాటల్ని చరణ్ షేర్ చేశాడు.
హింసా మార్గంలో కానీ, అహింసా మార్గంలో కానీ ప్రతీకారానికి పాల్పడటం సరైనది కాదని ఆ కొటేషన్ ద్వారా చరణ్ చెప్పదలచుకున్నట్లు మనకు అర్థమవుతుంది. ఆ కొటేషన్కు, ఆ ఫొటోలకూ సంబంధమేంటి? 'వినయ విధేయ రామ' చిత్రంలో హీరో అయిన రామ్ కొణిదెల విలన్పై హింసా మార్గంలో ప్రతీకారానికి పాల్పడతాడు. అందువల్ల రామ్ ఉన్నచోటే స్తంభించిపోయాడని చరణ్ చెప్పదలచుకున్నాడా? బాక్సాఫీస్ దగ్గర ఆ సినిమా ఫ్లాపయిన విషయం ఇక్కడ గమనార్హం.
సాధారణంగా ఇలాంటి కొటేషన్స్ను చరణ్ షేర్ చెయ్యడు. ఆధ్మాత్మిక అంశాలపై మక్కువ చూపే అతను ఈ లాక్డౌన్ పీరియడ్లో పుస్తకాలు చదువుతున్నాడనీ, అలా చదివిన 'ద చాయిస్' పుస్తకంలో తనకు నచ్చిన మాటల్ని షేర్ చేసుకున్నాడనీ ఊహించవచ్చు.