బాబాయ్ స్ఫూర్తి.. రామ్ చరణ్ విరాళం రూ.70 లక్షలు
on Mar 26, 2020
మెగాపవర్ స్టార్ రామ్చరణ్ మరోసారి ట్విట్టర్ ప్రపంచంలోకి అడుగుపెట్టారు. మరోసారి అని ఎందుకు అనాల్సి వచ్చిందంటే... గతంలో ఆయనకు ట్విట్టర్ అకౌంట్ ఉండేది. నెగిటివిటీ ఎక్కువైందని క్లోజ్ చేశారు. లేటెస్టుగా మళ్లీ ఇప్పుడు ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేశారు. తనయుడికి మెగాస్టార్ చిరంజీవి స్వాగతం పలికారు. సింహాన్ని చిన్న సింహం (లేదా సింహం పిల్ల) అనుసరించిందని మెగాస్టార్ పేర్కొనడం గమనార్హం. తన పుట్టినరోజు (మార్చి 27)కి ఒక్క రోజు ముందు ట్విట్టర్ ప్రపంచంలో అడుగుపెట్టిన రామ్ చరణ్, ఆల్రెడీ ఒక ట్వీట్ చేశారు. బాబాయ్ పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో తన వంతుగా కరోనాపై పోరుకి కేంద్ర, తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు రూ. 70 లక్షల రూపాయలను విరాళంగా ఇస్తున్నట్టు తెలిపారు.
"ఈ ట్వీట్ మీలో మంచిని కలిగిస్తుందని ఆశిస్తున్నాను. ఈ కష్టకాలంలో, పవన్ కళ్యాణ్ గారి ట్వీట్ స్పూర్తితో మన ప్రభుత్వాల ప్రశంసనీయ ప్రయత్నాలకు సహాయం చేయడానికి నావంతుగా కృషి చేయాలని అనుకుంటున్నాను. కేంద్ర ప్రభుత్వం... తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. 70 లక్షల రూపాయలను ఇస్తున్నాను. గౌరవ ప్రధానమంత్రి నరేంద్రమోడీజీ, గౌరవనీయ ముఖ్యమంత్రులు కేసీఆర్ గారు, జగన్ మోహన్ రెడ్డి గారు కోవిడ్ 19ని నిరోధించడానికి తీసుకుంటున్న చర్యలను ప్రశంసిస్తున్నాను. బాధ్యతాయుతమైన భారతీయ పౌరుడిగా ప్రతిఒక్కరూ ప్రభుత్వ నియమ నిబంధలను పాటించాలని కోరుకుంటున్నాను. జై హింద్" అని రామ్ చరణ్ ట్వీట్ చేశారు. పవన్ కళ్యాణ్ రూ. కోట్ల రూపాయలను ప్రధాని, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయనిధికి ఇస్తానని గురువారం ఉదయం ప్రకటించిన సంగతి తెలిసిందే.
Also Read