డ్రగ్ కేసులో తనను లాగడంపై కోర్టుకెక్కిన రకుల్ప్రీత్!
on Sep 17, 2020
బాలీవుడ్ను కుదిపేస్తున్న డ్రగ్ కేసు వ్యవహారంలో పూర్వాపరాలు పరిశీలించుకోకుండా రియా తన పేరును ఎన్సీబీ అధికారులకు చెప్పిందంటూ పదే పదే టీవీ చానళ్లు ప్రస్తావిస్తూ, తన పేరు ప్రతిష్ఠలకు భంగం కలిగిస్తున్నాయని ఢిల్లీ హైకోర్టు మెట్లెక్కింది టాలీవుడ్లో అగ్రశ్రేణి హీరోయిన్ అయిన రకుల్ ప్రీత్ సింగ్. ఆమె పిటిషన్పై స్పందించాల్సిందిగా కేంద్రం, నేషనల్ బ్రాడ్కాస్టర్స్ అసోసియేషన్ తదితరులను కోరిన హైకోర్టు బెంచ్.. వార్తల ప్రసారంలో మీడియా సంయమనం పాటిస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేసింది.
సుశాంత్సింగ్ రాజ్పుత్ మృతి కేసులో నిందితురాలైన రియా చక్రవర్తి డ్రగ్ సంబంధిత కేసులో ఎన్సీబీ విచారణ సందర్భంగా తన పేరు చెప్పిందంటూ మీడియా రిపోర్టులలో వెల్లడించడాన్ని తన పిటిషన్లో రకుల్ ప్రధానంగా ప్రస్తావించింది. "కొంత సంయమనం ఉండాలి. అధికారుల కంటే ముందే మీడియాకు సమాచారం తెలిసిపోతోంది. పేరుప్రతిష్ఠలు మాసిపోతున్నాయి." అని న్యాయమూర్తి నవీన్ చావ్లా వ్యాఖ్యానించారు.
కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వశాఖ, ప్రసార భారతి, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలకు ఆయన ఆదేశాలు జారీ చేస్తూ, రకుల్ పిటిషన్కు స్పందించాల్సిందిగా కోరారు. రకుల్ తరపున ఢిల్లీ హైకోర్టులో అడ్వకేట్లు అమన్ హింగోరానీ, హిమాన్షు యాదవ్, శ్వేతా హింగోరానీ పిటిషన్ దాఖలు చేశారు.