డిసెంబర్ 20న 'ప్రతిరోజూ పండగే'
on Oct 17, 2019
సాయితేజ్ కథానాయకుడిగా నటిస్తోన్న 'ప్రతిరోజూ పండగే' సినిమా విడుదల తేదీ వెల్లడైంది. మారుతి డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీని డిసెంబర్ 20న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. సాయితేజ్ జోడీగా రాశీ ఖన్నా నటిస్తోన్న ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పిస్తోండగా, బన్నీ వాస్ నిర్మిస్తున్నారు.
ఇటీవల కొన్ని కీలక సన్నివేశాల్ని రామోజీ ఫిలింసిటీలో చిత్రీకరించారు. నెక్స్ట్ షెడ్యూల్ని యు.ఎస్.లో జరపడానికి ప్లాన్ చేశారు. సాయితేజ్ పుట్టినరోజైన అక్టోబర్ 15న ఫస్ట్ గ్లింప్స్ పేరిట విడుదల చేసిన వీడియో క్లిప్కు మంచి స్పందన వచ్చింది. తాతామనవళ్లుగా నటించిన సత్యరాజ్, సాయితేజ్ మధ్య సన్నివేశాలు ఈ వీడియోలో చూడముచ్చటగా ఉన్నాయి. సినిమాలో వాళ్ల మధ్య బంధం హైలైట్ అవుతుందని దర్శకుడు మారుతి చెబుతున్నారు. ఫ్యామిలీ ఎమోషన్స్తో ఈ సినిమాను ఆయన తెరకెక్కిస్తున్నారు.
"సాయి తేజ్ను కొత్త రకమైన పాత్ర చిత్రణతో, న్యూ లుక్లో చూపిస్తున్నాం. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెప్పించే కుటుంబ బంధాల్ని, విలువల్ని ఎమోషనల్గా చిత్రీకరిస్తున్నాం. నా చిత్రాల్లో సహజంగా కనిపించే ఎంటర్టైన్మెంట్ ఇందులో రెండు రెట్లు ఎక్కువగానే ఉంటుంది" అని తెలిపారు మారుతి. 'సుప్రీమ్' వంటి హిట్ మూవీ తర్వాత సాయితేజ్, రాశీ ఖన్నా కలిసి నటిస్తోన్న చిత్రం 'ప్రతిరోజూ పండగే'. కట్టప్పగా తెలుగు ప్రేక్షకులకి మరింత చేరువైన ప్రముఖ నటులు సత్యరాజ్ క్యారెక్టర్ని మారుతి ప్రత్యేకంగా డిజైన్ చేశారని నిర్మాత బన్నీ వాస్ చెప్పారు. అలానే ఈ సినిమాలో నటిస్తున్న మరో నటుడు రావు రమేశ్ పాత్ర కూడా హైలెట్గా ఉంటుందన్నారు. తమన్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రానికి జయకుమార్ సినిమాటోగ్రాఫర్గా పనిచేస్తున్నాడు.