ఖరారు: 'అర్జున్రెడ్డి' డైరెక్టర్తో ప్రభాస్
on Dec 28, 2019
సందీప్రెడ్డి వంగా.. ఈ పేరు ఇవాళ కేవలం తెలుగునాట మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా సుపరిచతం. విజయ్ దేవరకొండ టైటిల్ పాత్రధారిగా అతను రూపొందించిన తొలి చిత్రం 'అర్జున్రెడ్డి' సెన్సేషనల్ హిట్టయి, విజయ్ను యూత్ ఐకాన్గా మార్చిన విషయం మనకు తెలుసు. కోపాన్ని అదుపులో పెట్టుకోలేని ఒక అర్జున్రెడ్డి అనే డాక్టర్ కథను తెరపై సందీప్రెడ్డి ప్రెజెంట్ చేసిన విధానం యూత్ను అమితంగా ఆకట్టుకుంది. అదే సినిమాను 'కబీర్ సింగ్' పేరుతో షాహిద్ కపూర్ హీరోగా హిందీలో రీమేక్ చేశాడు సందీప్రెడ్డి. అది తెలుగు సినిమా కంటే మరింత బ్లాక్బస్టరై, షాహిద్ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఫిలింగా, 2019లో సెకెండ్ హయ్యెస్ట్ గ్రాసర్గా నిలిచింది. ఆ సినిమా తర్వాత సందీప్రెడ్డి బాలీవుడ్లోనూ విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నాడు. అతనితో సినిమాలు నిర్మించేందుకు నిర్మాతలూ, అతని దర్శకత్వంలో నటించేందుకు హీరోలూ ఉత్సాహం చూపిస్తూ వస్తున్నారు.
ఈ నేపథ్యంలో తన తర్వాతి సినిమాను బాలీవుడ్లోనే తియ్యాలనుకున్న సందీప్, అక్కడి టాప్ హీరోల్లో ఒకడైన రణబీర్ కపూర్ను సంప్రదించడం, అతను ఓకే అనడం కూడా జరిగిపోయింది. అయితే తర్వాత ఏమైందో ఏమో, ఆ ప్రాజెక్ట్ నుంచి రణబీర్ తప్పుకున్నాడు. దాంతో ప్రెజెంట్ పాన్-ఇండియా స్టార్ ప్రభాస్ను కలిసి స్క్రిప్ట్ వినిపించాడు సందీప్. సూపర్నేచురల్ (అతీంద్రియ శక్తులు) నేపథ్యంలో నడిచే 'డెవిల్' అనే ఈ స్క్రిప్టును ప్రభాస్ ఇష్టపడ్డాడు. ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ కుమార్ డైరెక్షన్లో 'జాన్' అనే సినిమా చేస్తున్నాడు. దాని షూటింగ్ పూర్తయ్యాక సందీప్రెడ్డితో 'డెవిల్'ను ప్రభాస్ చేయడం దాదాపు ఖాయమేనని అంతర్గత వర్గాలు తెలిపాయి. దేశవ్యాప్తంగా క్రేజ్ ఉన్న హీరో, డైరెక్టర్ కలిసి చేసే 'డెవిల్' బాక్సాఫీస్ దగ్గర చేసే హంగామా ఎలా ఉంటుందో ఊహించుకోవాల్సిందే.