రాజకీయవేత్త అవతారమెత్తిన పాయల్ ఘోష్!
on Oct 26, 2020
డైరెక్టర్ అనురాగ్ కశ్యప్పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసి కొద్ది వారాల క్రితం వార్తల్లో వ్యక్తిగా మారిన నటి పాయల్ ఘోష్ తాజాగా రాజకీయవేత్త అవతారమెత్తారు. సోమవారం కేంద్ర మంత్రి రామ్దాస్ అథవాలే నాయకత్వంలోని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాలో చేరారు. ఆ వెంటనే ఆమెను ఆ పార్టీ మహిళా విభాగానికి ఉపాధ్యక్షురాలిగా అథవాలే నియమించడం విశేషం.
తన సమక్షంలో పార్టీలో చేరిన పాయల్కు రామ్దాస్ అథవాలే స్వాగతం పలికారు. ఆమెకు ధన్యవాదాలు తెలిపారు. ఆర్పిఐ (ఎ) జెండా చేతపట్టుకున్న పాయల్ పిక్చర్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ పిక్చర్లలో ఆమె ముఖానికి మాస్క్ ధరించి ఉండటాన్ని గమనించవచ్చు. "పార్టీలో జాయినయినందుకు ఆమెకు ధన్యవాదాలు తెలిపి, స్వాగతం పలికాను" అని పార్టీ అధ్యక్షుడు, కేంద్రమంత్రి అథవాలే చెప్పారు.
కొన్ని వారాల క్రితం అనురాగ్ కశ్యప్ తనను లైంగికంగా బలవంతం చేశాడంటూ ఆరోపించిన పాయల్, సెప్టెంబర్ 23న ముంబైలోని వెర్సోవా పోలీస్ స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదులో కశ్యప్ 2013లో లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని తెలిపారు. ఈ ఉదంతంలో పాయల్కు రామ్దాస్ అథవాలే మద్దతుగా నిలిచారు. అక్టోబర్ 1న ముంబై పోలీసులో కశ్యప్ను విచారించారు. తనపై పాయల్ చేసిన ఆరోపణలన్నింటినీ కశ్యప్ ఖండించాడు. పాయల్ తనపై లైంగిక వేధింపులు జరిగాయని ఫిర్యాదులో పేర్కొన్న సమయంలో తానసలు ఇండియాలోనే లేననీ, శ్రీలంకలో ఉన్నాననీ తెలుపుతూ దానికి ఆధారంగా డాక్యుమెంట్లు సమర్పించాడు.
ఇప్పుడు రామ్దాస్ అథవాలే పార్టీలో పాయల్ చేరడం ప్రాధాన్యం సంతరించుకుంది.
Also Read