మే 15న 'వకీల్ సాబ్' వస్తాడా?
on Mar 28, 2020
రెండేళ్ల విరామంతో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తొలిగా స్టార్ట్ చేసిన సినిమా 'వకీల్ సాబ్'. హిందీ హిట్ ఫిల్మ్ 'పింక్'కు రీమేక్ అయిన ఈ మూవీలో పవన్ కల్యాణ్ టైటిల్ రోల్ చేస్తున్నాడు. వాస్తవానికి ఈ సినిమా కథ లైంగిక వేధింపులకు గురైన ముగ్గురు యువతుల చుట్టూ నడిచే కథ అయినా, ఒరిజినల్లో అమితాబ్ బచ్చన్ చేసిన లాయర్ క్యారెక్టర్తో పోలిస్తే 'వకీల్ సాబ్'లో పవన్ క్యారెక్టర్ను బాగా పెంచేశారని యూనిట్ వర్గాల సమాచారం. అందుకే టైటిల్ను కూడా పవన్ క్యారెక్టర్పైనే పెట్టారు. 'మిడిల్ క్లాస్ అబ్బాయి' ఫేమ్ శ్రీరామ్ వేణు డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీని మే 15న విడుదల చేయాలని సంకల్పించినట్లు నిర్మాత దిల్ రాజు ఇదివరకే ప్రకటించారు.
కానీ ఇప్పుడు కరోనా వ్యాప్తి నిరోధంలో భాగంగా లాక్డౌన్ విధించడం, షూటింగ్లు నిలిచిపోవడంతో అనుకున్న సమయానికి 'వకీల్ సాబ్' ప్రేక్షకుల ముందుకు వస్తాడా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ పూర్తి కాలేదు. పవన్కు సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలు ఇంకా చిత్రీకరించాల్సి ఉంది. ఏప్రిల్ 14 తర్వాత లాక్డౌన్ను సడలిస్తే, షూటింగ్స్ మళ్లీ మొదలవుతాయనే ఆశాభావంతో సినీ వర్గాలు ఉన్నాయి. అయితే అప్పటికే కోవిడ్-19 ప్రభావం తగ్గుముఖం పట్టాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అలా కనిపించడం లేదు. లాక్డౌన్ ఇంకా కొనసాగేలా ఉంది. ఒకవేళ లాక్డౌన్ తీసేసినా కరోనా వ్యాప్తి భయాందోళనలు అప్పుడే సద్దుమణిగేలా లేవు. ఫలితంగా షూటింగ్లు తిరిగి కొనసాగడానికి మరింత సమయం పట్టవచ్చని అంచనా వేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఏది ఎలా జరిగినా, మే 15కు సినిమా విడుదలకు సిద్ధమయ్యేలా మిగతా పనులు చేసుకుంటూ వెళ్తున్నాడు దిల్ రాజు. ఇప్పటివరకూ చిత్రీకరించిన సన్నివేశాలు ఎడిటింగ్ పూర్తయ్యిందనీ, తనకు సంబంధించిన సన్నివేశాలకు పవన్ కల్యాణ్ డబ్బింగ్ స్టార్ట్ చేశారనీ తెలుస్తోంది. ఇప్పటికే ఎడిటింగ్ పూర్తయిన సన్నివేశాలకు నివేదా థామస్, అంజలి, అనన్య నాగళ్ల తదితరులు డబ్బింగ్ చెప్పేశారని వినిపిస్తోంది. ఏమాత్రం పరిస్థితులు చక్కబడినా అనుకున్నట్లే మే 15న సినిమాని విడుదల చేయాలనేది దిల్ రాజు సంకల్పం. చూద్దాం.. ఏమవుతుందో!
Also Read