కరోనా ఎఫెక్ట్.. 'జూలై సెన్సేషన్'కి బ్రేక్
on Jun 6, 2020
తెలుగు చిత్రసీమకి అచ్చొచ్చిన నెలల్లో జూలై ఒకటి. ఈ నెల వేదికగా గతంలో పలు బ్లాక్బస్టర్ హిట్స్ని చూసింది టాలీవుడ్. మరీ ముఖ్యంగా.. గడిచిన ఆరేళ్ళ కాలంలో ప్రతీ క్యాలెండర్ ఇయర్లోనూ జూలై ముంగిట ఓ సెన్సేషనల్ హిట్ ఉండడం టాక్ ఆఫ్ టాలీవుడ్ అయింది.
2014 జూలైలో విడుదలైన ‘దృశ్యం’(విక్టరీ వెంకటేష్, మీనా)తో ఈ సెన్సేషన్ల పరంపరకు బీజం పడగా.. 2015 జూలైలో రిలీజైన ‘బాహుబలి: ది బిగినింగ్’(యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, తమన్నా)తో ఈ సెంటిమెంట్ బలపడింది. గత రికార్డులను భూస్థాపితం చేస్తూ ‘బాహుబలి: ది బిగినింగ్’ సాధించిన ఘనవిజయం జూలై నెలని మరోసారి వార్తల్లో నిలిపింది.
ఇక 2016 సంవత్సరం విషయానికొస్తే ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన చిన్న సినిమా ‘పెళ్లిచూపులు’(యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండ, రీతూ వర్మ) అఖండ విజయం సాధించి ఈ సెన్సేషనల్ జూలై సిరీస్ని కొనసాగించింది. అలాగే 2017 క్యాలెండర్ ఇయర్లో ‘ఫిదా’(మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, సాయి పల్లవి) రూపంలో ఈ ట్రెండ్ కొనసాగింది. అదే విధంగా 2018 జూలైలో విడుదలైన ‘ఆర్ఎక్స్100’(కార్తికేయ, పాయల్ రాజ్పుత్).. బాక్సాఫీస్నే ఆశ్చర్యంలో ముంచెత్తేలా ఘనవిజయాన్ని మూట కట్టుకుంది. ఇక గత ఏడాది అయితే ‘ఇస్మార్ట్ శంకర్’(ఎనర్జిటిక్ స్టార్ రామ్, నిధి అగర్వాల్, నభా నటేశ్) జీరో ఎక్సెపెక్టేషన్స్తో రిలీజ్ అయి.. అన్ఎక్స్పెక్టెడ్ బ్లాక్బస్టర్గా నిలిచిపోయింది.
ఈ క్రమంలో 2020 సంవత్సరంలోనూ ఈ పరంపరని కొనసాగించే చిత్రం ఏదవుతుందా? అనే ఆసక్తి నెలకొంది. అయితే అనూహ్యంగా కరోనా ఎఫెక్ట్తో జూలైలో సినిమాలు విడుదలయ్యే వాతావరణం కనిపించకపోవడంతో.. ఈ 'జూలై సెన్సేషనల్' సిరీస్కి బ్రేక్ పడుతున్నట్టవుతోంది. మరి వచ్చే ఏడాది నుంచి ఈ సిరీస్ మరల కొనసాగుతుందేమో చూడాలి.