పద్మావతికి అడ్డుతగులుతోన్న ఆ రాజకీయపార్టీ..?
on Nov 20, 2017
క్రీశ. 12వ శతాబ్ధానికి చెందిన చిత్తోడ్గఢ్ మహారాణి పద్మావతి జీవిత కథతో విలక్షణ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన చిత్రం పద్మావతి.. దీపికా పదుకొణే, రణ్వీర్ సింగ్, షాహిద్ కపూర్ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని డిసెంబర్ 1న విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది. అయితే తమ రాణికధను వక్రీకరిస్తున్నారని.. ఆరోపిస్తూ రాజ్పుత్ కర్ణీసేన కార్యకర్తలు షూటింగ్ టైం నుంచి ఈ సినిమాకి అడ్డుతగులుతూనే ఉన్నారు. ఒక దశలో దర్శకుడు భన్సాలీపై దాడికి పాల్పడ్డారు కూడా.. అయినా వెనక్కుతగ్గని ఆయన సినిమాను పూర్తి చేశారు. అయితే ట్రైలర్ రిలీజైన తర్వాత ఆందోళనలు మరింత ఎక్కువయ్యాయి. పద్మావతిని కనుక విడుదల చేస్తే నటీనటులపైనా, ధియేటర్లపైనా దాడులకు దిగుతామని రాజ్పుత్ యువసేన, రాజ్పుత్ కర్ణీసేన వంటి సంస్థలు హెచ్చరిస్తున్నాయి.
సరిగ్గా ఇలాంటి సమయంలో సెన్సార్కు వెళ్లిన పద్మావతిని తిరిగి వెనక్కి పంపించింది సీబీఎఫ్సీ. దీంతో పద్మావతి విడుదలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది ఆ చిత్ర నిర్మాణ సంస్థ వయోకామ్ 18 మోషన్ పిక్చర్స్. అయితే సినిమాను ఆపడానికి తెర వెనుక పెద్దతలకాయలు ప్రయత్నిస్తున్నారంటూ బీటౌన్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. డిసెంబర్ 1న కనుక పద్మావతిని విడుదల చేస్తే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఓడిస్తామని రాజపుత్రులు, క్షత్రియులు హెచ్చరించిన నేపథ్యంలో సినిమాను ఎన్నికలు అయ్యేవరకు ఆపాలని కమలనాథులు భావిస్తున్నారని.. అందుకే సెన్సార్ చేయకుండా కేంద్రప్రభుత్వం, సీబీఎఫ్సీ మీద ఒత్తిడి తెస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.