తమిళ దర్శకుడ్ని పిలిచించిన ఎన్టీఆర్...
on Apr 10, 2018
తెలుగు కథానాయకులు అప్పుడప్పుడు తమిళ దర్శకుల వెంట పడడం మామూలే. అయితే ఈమధ్య ఈ ట్రెండ్ బాగా తగ్గింది. రాజమౌళి, కొరటాల, త్రివిక్రమ్, బోయపాటి శ్రీను.. ఇలా మన దగ్గరే కావల్సినంతమంది స్టార్ దర్శకులు ఉన్నారు. అయితే ఇప్పుడు ఎన్టీఆర్ దృష్టిమాత్రం ఓ తమిళ దర్శకుడిపై పడిందని తెలుస్తోంది. తనెవరో కాదు... అట్లీ. రాజారాణి,తేరి సినిమాలతో ఆకట్టుకున్నాడు ఈ యువ దర్శకుడు. మెర్శల్ అయితే తమిళనాట సంచలనం సృష్టించింది. అట్లీతో పనిచేయాలని కొంతమంది తెలుగు కథానాయకులు ఉత్సాహం చూపిస్తున్నారు. అందరికంటే ముందుగా ఎన్టీఆర్ నుంచి అట్లీకి పిలుపు అందింది. ఆదివారం ఎన్టీఆర్ - అట్లీ మధ్య భేటీ జరిగిందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇద్దరి మధ్య కథకి సంబంధించిన చర్చలు జరిగాయని టాక్. 'మనమిద్దరం కలసి పనిచేద్దాం.. రెడీగా ఉండు' అంటూ అట్లీకి ఎన్టీఆర్ హింట్ ఇచ్చేశాడని, అట్లీ కూడా ఎన్టీఆర్ తో ఓ సినిమా చేయడానికి బాగా ఉత్సాహపడుతున్నాడని టాక్. అయితే ఎన్టీఆర్ ఇప్పుడు బిజీ బిజీ. త్రివిక్రమ్ సినిమా పట్టాలెక్కాల్సివుంది. ఆ తరవాత రాజమౌళి మల్టీస్టారర్ మొదలైపోతుంది. అట్లీతో జట్టు కుదరాలంటే కనీసం యేడాదైనా ఆగాల్సిందే.