తారక్, కొరటాల.. ఉగాదికి ప్రకటన?
on Apr 8, 2021
యంగ్ టైగర్ యన్టీఆర్, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చిన `జనతా గ్యారేజ్` (2016) ఎంతటి ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సినిమాతో దర్శకుడిగా కొరటాల హ్యాట్రిక్ విజయాన్ని అందుకోగా.. `ఉత్తమ నటుడు` విభాగంలో `నంది` పురస్కారాన్ని కైవసం చేసుకున్నారు తారక్. కట్ చేస్తే.. ఐదేళ్ళ విరామం తరువాత ఈ ఇద్దరి కాంబినేషన్ లో మరో సినిమా రాబోతోందట.
ఆ వివరాల్లోకి వెళితే.. ఇటీవల తారక్, కొరటాల మధ్య ఓ స్క్రిప్ట్ కి సంబంధించి చర్చలు జరిగాయని.. దాదాపుగా ప్రాజెక్ట్ సెట్ అయిందని టాక్. అంతేకాదు.. ఉగాది పర్వదినం సందర్భంగా ఈ సినిమాకి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడనుందని వార్తలు వినిపిస్తున్నాయి. మరి.. ఈ కథనాల్లో నిజమెంతో తెలియాలంటే ఏప్రిల్ 13 వరకు వేచి చూడాల్సిందే.
కాగా, యన్టీఆర్ తాజా చిత్రం `ఆర్ ఆర్ ఆర్` అక్టోబర్ 13న విడుదల కానుండగా.. కొరటాల అప్ కమింగ్ ప్రాజెక్ట్ `ఆచార్య` మే 13న రిలీజ్ కానుంది. ఆపై త్రివిక్రమ్ తో తారక్.. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో కొరటాల సినిమా చేయనున్నారు.