దాతృత్వంలో పవర్ స్టార్కు సరిలేరు!
on Mar 26, 2020
దాతృత్వాన్ని ప్రదర్శించడంలో టాలీవుడ్లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్కు సాటి రాగలగేవాళ్లు లేరని చెప్పవచ్చు. కరోనా వైరస్ వ్యాప్తిని ఎదుర్కోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అత్యధిక విరాళాలు అందించిన టాలీవుడ్ సెలబ్రిటీ పవన్ కల్యాణ్. ప్రధానమంత్రి సహాయనిధికి రూ. కోటి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధులకు చెరొక రూ. 50 లక్షలు.. వెరసి రూ. 2 కోట్ల విరాళం ప్రకటించి తన మానవతా దృష్టిని ఆయన చాటుకొన్నాడు. ఇప్పుడే కాదు.. ఇదివరకు పలు సందర్భాల్లో కూడా ఆయన ఇదే తరహాలో విరాళాలు అందించి ఆయా విపత్తుల్లో తన వంతు కర్తవ్యాన్ని నిర్వర్తించారు.
ఇటీవల దేశానికీ, దేశంలోని ప్రజానీకానికీ భద్రత కలిగిస్తూ సేవ చేస్తున్న ఆర్మీ జవాన్ల సంక్షేమం నిమిత్తం రూ. కోటి విరాళం అందించిన విషయం జ్ఞాపకం ఉండే ఉంటుంది. అంతకుముందు హిమాచల్ప్రదేశ్లో వచ్చిన వరదల కారణంగా నిరాశ్రయులైన వారి ఆలంబన కోసం రూ. 20 లక్షలు అందజేసిన ఆయన, వైజాగ్లో హుద్-హుద్ తుఫాను బాధితుల సంక్షేమం కోసం రూ. 50 లక్షలు ఇచ్చారు. అలాగే 2015 డిసెంబర్లో చెన్నైని వరదలు ముంచెత్తి, వేలాదిమందిని నిరాశ్రయులు చేసినప్పుడు తమిళనాడు సీఎం సహాయనిధికి రూ. 2 కోట్లు విరాళం అందజేసిన దాతృత్వం పవర్ స్టార్ది. ఇప్పుడు కరోనా కరాళనృత్యం చేస్తున్న సందర్భంలో మరోసారి తన దాతృత్వాన్ని ప్రదర్శించిన పవన్ కల్యాణ్పై ఆన్లైన్లో ప్రశంసలు కురుస్తున్నాయి.