అక్టోబర్ నుంచి సమంతకు సెలవులు లేవు!
on Aug 7, 2020
దాదాపు ఏడాది తర్వాత సినిమా సెట్స్ మీదకు వెళ్లేందుకు సిద్ధమవుతోంది సమంత అక్కినేని. గత ఏడాది ఆమె రెండు సినిమాల్లో కనిపించింది. 'ఓ బేబీ' సూపర్ హిట్ కాగా, క్లాసిక్ ఫిల్మ్ అవుతుందనే నమ్మకంతో చేసిన 'జాను' డిజాస్టర్ అయ్యింది. 'జాను' సినిమా షూటింగ్ను ఆమె అక్టోబర్లో పూర్తి చేసింది. అప్పట్నుంచీ మరో సినిమా ఏదీ ఆమె చేయలేదు. ఈలోపు కుటుంబానికే ప్రాధాన్యం ఇస్తూ వచ్చిన ఆమెకు లాక్డౌన్ కారణంగా మరింత తీరిక లభించింది. తాజా సమాచారం ప్రకారం ఆమె ఇటీవల సంతకం చేసిన సినిమా విజయదశమి రోజున లాంఛనంగా ప్రారంభం కానున్నది. గత ఏడాది తాప్సీతో 'గేమ్ ఓవర్' మూవీని తీసిన అశ్విన్ శరవణన్ ఈ సినిమాని డైరెక్ట్ చేయనున్నాడు. సోనీ పిక్చర్స్ నిర్మించే ఈ సినిమా అక్టోబర్లోనే సెట్స్ మీదకు వెళ్లనున్నది.
ఇది కాకుండా విఘ్నేశ్ శివన్ డైరెక్ట్ చేసే మరో సినిమాలోనూ నటించడానికి సమంత అంగీకరించింది. అందులో నయనతార కూడా నటిస్తుండటం గమనార్హం. 'కాదువాకుల రెండు కాదల్' అనే టైటిల్తో తమిళంలో రూపొందే ఈ మూవీకి తెలుగు టైటిల్ను ఇంకా నిర్ణయించలేదు. త్వరలోనే ఇది కూడా ప్రారంభం కానున్నది. ప్రస్తుతం రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు దూరంగా ఉంటున్న సమంత.. పర్ఫార్మెన్స్కు చాన్స్ ఉన్న క్యారెక్టర్లు, స్క్రిప్టులు మాత్రమే ఒప్పుకుంటోంది.