ఎన్టీయార్ కుటుంబాన్ని కలవను.. ఆయనపై మరిన్ని సినిమాలు తీస్తా!
on Oct 17, 2017
‘మాట తప్పను... మడమ తిప్పను.. ఎన్టీయార్ బయోపిక్ తీసి తీరుతా. దానికి ఎవరి పర్మిషన్ అక్కర్లేదు. ఆ మాటకొస్తే.. ఈ విషయంలో ఎన్టీయార్ కుటుంబ సభ్యులను కూడా నేను కలవడను’ అని తెగేసి చెబుతున్నాడు వివాదాల వర్మ. ఈయన గారి నిర్ణయం నిజంగానే తెలుగుదేశంలో చాలామంది కళ్లకు కునుకు లేకుండా చేస్తోంది. ఎలక్షన్లు రాబోతున్న సమయంలో ఈ రచ్చేంట్రా భగవంతుడా? అని తెలుగుదేశం సీనియర్ లీడర్లు అనుకుంటున్నారట.
అసలు ఈ ఎన్టీయార్ బయోపిక్ అనే తేనె పట్టును కదిలించింది బాలకృష్ణ. దాంతో బాలయ్య మీద కూడా చంద్రబాబు కాస్తంత గుర్రుమీదున్నాడని సమాచారం. ఎన్టీయార్ బయోపిక్ గురించి రోజుకొక స్టేట్మెంట్ ఇస్తూ.. సినిమాపై హైప్ పెంచేస్తున్నాడు వర్మ. దీంతో వదలడట. ఎన్టీయార్ పై ఇంకా చాలా సినిమాలు తీస్తాడట. ఈ విషయంపై వర్మ స్పందన ఇలా వుంది. ‘ఎన్టీయార్ జీవితం మహాభారతం. అందులో ఆసక్తికరమైన చాలా ఘట్టాలున్నాయ్. దాన్ని రెండు గంటల్లో తీయలేం. అందుకే.. ముందు ఆయన చివరి ఘట్టం తీస్తున్నాను. ఆ తర్వాత మిగిలిన ఘట్టాలు కూడా తీయాలనుంది. ఈ విషయంలో నేను ఎన్టీయార్ కుటుంబ సభ్యులను కలవను. ఎందుకంటే... వారికి ఆయనపై ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంటుంది. అందుకే.. వారిని కాకుండా... ఆయన ఇంట్లో పని చేసిన వంట వాళ్లను. పని వాళ్లను, డ్రైవర్లను కలుస్తాను. వారి దగ్గరే అసలైన సమాచారం ఉంటుందని నా నమ్మకం. ఈ సినిమాలో అందరూ కొత్తవాళ్లే నటిస్తారు. ఎన్టీయార్ పాత్ర చేసే వ్యక్తిని ఇప్పటికే సెలక్ట్ చేశాను. ఓ వైపు శిక్షణ కూడా ఇస్తున్నాం.
అసలు ఎన్టీయార్ బయోపిక్ ఎప్పుడో తీయాలనుకున్నాను. కానీ.. ఏం తీయాలో నా దగ్గర క్లారిటీ లేదు. అయితే... ఈ మధ్య యూట్యూబ్ లో ఎన్టీయార్, లక్ష్మీపార్వతి కి సంబంధించిన కొన్ని వీడియోలు చూశాను. అవి చూశాక.. ఏం తీయాలో క్లారిటీ వచ్చింది. ఎన్టీయార్ జీవితంలోకి లక్ష్మీపార్వతి ఎంటరైనప్పట్నుంచీ కథ చాలా ఆసక్తిగా సాగుతుందని ఒక దర్శకునిగా నా ఫీలింగ్. అందుకే ఈ నేపథ్యాన్ని ఎంచుకున్నా’ అని చెప్పుకొచ్చాడు వర్మ. అయితే.. దీనిపై తెలుగుదేశం నాయకులతో పాటు ఎన్టీయార్ కుమార్తె పురందేశ్వరి కూడా విభిన్నంగా స్పందించారు. కేవలం ఒక భాగాన్నే చిత్రీకరించడం సరికాదనీ, ఆయన జీవితం మహోన్నతమైందనీ.. తీస్తే.. అదంతా తీయాలని పురందేశ్వరి అభిప్రాయం వెలిబుచ్చారు.
మరో వైపు బాలకృష్ణ చేయబోతున్న ఎన్టీయార్ బయోపిక్ కి సంబంధించిన కార్యక్రమాలు కూడా చకచకా జరుగుతున్నాయ్. తేజా దర్శకునిగా ఎంపికయ్యాడు. సాయిమాధవ్ బుర్రాకు సంభాషణలు రాసే బాధ్యతను అప్పగించారు. ఇందులో ఎన్టీయార్ గా బాలకృష్ణే నటించబోతున్నారు. రాబోతున్న ఎన్నికలపై అన్నగారి జీవితం ఏ విధమైన ప్రభావం చూపిస్తుందో చూడాలి.