హిమాలయాల్లో 'వైల్డ్ డాగ్' టీమ్ హల్చల్.. ఫొటోలు షేర్ చేసిన నాగ్!
on Oct 29, 2020
అక్కినేని నాగార్జున టైటిల్ రోల్ పోషిస్తోన్న చిత్రం 'వైల్డ్ డాగ్'. ఇది మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై నిర్మాణమవుతోన్న 6వ చిత్రం. అహిషోర్ సాల్మన్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా తాజా షెడ్యూల్ హిమాచల్ ప్రదేశ్లోని మనాలీలో ఉన్న సుందర ప్రదేశాల్లో ఇటీవలే మొదలైంది. బిగ్ బాస్ 4 షోకు విరామమిచ్చి మరీ నాగార్జున మూడు వారాల పాటు ఈ సినిమా షూటింగ్లో పాల్గొనేందుకు అక్కడకు వెళ్లారు. నాగార్జునతో పాటు బాలీవుడ్ తార సయామీ ఖేర్, బిగ్ బాస్ 3 కంటెస్టెంట్, టీవీ స్టార్ అలీ రజా, స్టాండప్ కమెడియన్ మయాంక్ పరఖ్ తదితరులపై హిమాలయాల్లో సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. దీనికి సంబంధించిన రెండు పిక్చర్లను గురువారం నాగార్జున తన సోషల్ మీడియా హ్యాడిల్స్ ద్వారా విడుదల చేశారు.
'వైల్డ్ డాగ్'లో ఆయన ఏసీపీ విజయ్ వర్మ రోల్లో కనిపించనున్నారు. తన టీమ్తో కలిసి ఆయన ఒక ఆపరేషన్లో పాల్గొంటున్న సన్నివేశాలను తీస్తున్నట్లు నాగార్జున షేర్ చేసిన ఫొటోలను బట్టి తెలుస్తోంది. క్రిమినల్స్ను విజయ్ వర్మ నిర్దాక్షిణ్యంగా డీల్ చేసే విధానంతో ఆయనను అందరూ వైల్డ్ డాగ్ అని పిలుస్తుంటారు. అందుకే "హిమాలయాల్లో తన టీమ్తో వైల్డ్ డాగ్. స్వేచ్చను, ప్రకృతిని ఇష్టపడుతున్నా" అని ట్వీట్ చేశారు నాగార్జున.
ఇదివరకు అక్టోబర్ 23న మనాలీకి వెళ్లిన ఆయన అక్కడి ప్రకృతి సౌందర్యానికి ఆయన పరవశించిపోయారు. ప్రేక్షకులతో ఆ ఆనందాన్ని ఓ వీడియో ద్వారా పంచుకున్నారు.
"హాయ్.. ఇది రోహ్తంగ్ పాస్ (రోహ్తంగ్ కనుమ)లోని అందమైన ఉదయం. సముద్ర మట్టానికి మూడు వేల తొమ్మిది వందల ఎనభై మీటర్ల ఎత్తులో ఉన్న ప్రాంతం. అంటే పదమూడు వేల అడుగుల ఎత్తు. ఇది చాలా ప్రమాదకరమైన కనుమ. నవంబర్ నుంచి మే నెల వరకు దీన్ని మూసేస్తారు. 'వైల్డ్ డాగ్' షూటింగ్ కోసం ఇక్కడకు వచ్చాం. ఈ సినిమా షూటింగ్ చాలా బాగా జరుగుతోంది. అందమైన పర్వతాలు, నీలాకాశం, జలపాతాలు.. ఇక్కడ ఉండటం ఎంతో బాగుంది. ఏడు నెలల తర్వాత ఇటువంటి ప్లేస్కు రావడం చాలా ఆనందంగా ఉంది. 21 రోజుల్లో షూటింగ్ పూర్తయిపోతుంది. ఆ తర్వాత (హైదరాబాద్) వచ్చేస్తాను. లవ్ యు ఆల్. సీ యు." అంటూ ఉత్సాహంగా చెప్పారు నాగార్జున.
Also Read