నాగచైతన్య ఆ రీమేక్ చేయట్లేదు!
on Apr 8, 2020
శ్రీదేవి భర్త, పేరుపొందిన బాలీవుడ్ ప్రొడ్యూసర్ బోనీ కపూర్ 'నెర్కొండ పార్వై' అనే తమిళ మూవీతో సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. అది హిందీలో హిట్టయిన 'పింక్'కు రీమేక్. అదే సినిమా తెలుగు రీమేక్ 'వకీల్ సాబ్'తో తెలుగులోకీ అయన అడుగుపెడుతున్నారు. పవన్ కల్యాణ్ నటిస్తోన్న ఈ సినిమాని ఆయన దిల్ రాజుతో కలిసి నిర్మిస్తున్నారు.
కాగా బోనీ కపూర్ హిందీలో హిట్టయిన 'బధాయి హో' (2018) సినిమా తెలుగు, తమిళ రీమేక్ హక్కులు పొందారు. అమిత్ శర్మ డైరెక్ట్ చేసిన ఆ మూవీలో ఆయుష్మాన్ ఖురానా హీరోగా నటించాడు. ఆ సినిమా తెలుగు రీమేక్ని కూడా దిల్ రాజుతో కలిసి నిర్మించాలనేది బోనీ ఆలోచన. ఒరిజినల్లో ఆయుష్మాన్ చేసిన రోల్కు వాళ్లు నాగచైతన్యను ఎంచుకున్నారు. మొదట చైతూ కూడా ఆ రీమేక్ విషయంలో ఆసక్తి చూపించినట్లు ప్రచారంలోకి వచ్చింది.
తాజా సమాచారం ప్రకారం నాగచైతన్య ఆ సినిమా చేయబోవట్లేదని తెలిసింది. తెలుగు ప్రేక్షకుల అభిరుచులకు ఆ సినిమా కథ నప్పదనీ, అందుకే చైతూ ఆ సినిమా చేసే ఆలోచనను విరమించుకున్నాడని అతని సన్నిహిత వర్గాలు తెలిపాయి. దిల్ రాజు కూడా ఆ సినిమాపై అనాసక్తి ప్రదర్శిస్తున్నాడని వినికిడి. మరి బోనీ ఎవరితో ఆ రీమేక్ చేస్తారో వేచి చూడాల్సిందే.