'మిర్జాపూర్' మున్నా నిజంగానే 40 మందిని హత్య చేశాడు!
on Oct 27, 2020
ప్రైమ్ వీడియోలో ఇటీవలే 'మిర్జాపూర్ 2' సిరీస్ విడుదలై, వీక్షకుల్లో అమితమైన క్రేజ్ తెచ్చుకుంది. గ్యాంగ్ వార్స్, పగ-ప్రతీకారాలు, క్రూర హత్యలతో సాగే ఈ సిరీస్లో మిర్జాపూర్కు మకుటంలేని మహారాజు కావాలనుకొని ఒకరితో ఒకరు తలపడే గుడ్డు పండిట్, మున్నా భయ్యా మధ్య యుద్ధాన్ని మనం చూస్తున్నాం.
ఆశ్యర్యకరమైన విషయమేమంటే ఉత్తరప్రదేశ్లోని మిర్జాపూర్లో మున్నా బజ్రంగి పేరుతో నిజమైన గ్యాంగ్స్టర్ నిన్న మొన్నటిదాకా ఉండేవాడు. మున్నా అంటే మిర్జాపూర్తో పాటు జాన్పూర్, వారణాసి ప్రాంతాల జనం భయంతో వణికిపోయేవారు. మున్నా బజ్రంగి అసలు పేరు ప్రేమ్ ప్రకాశ్ సింగ్. తొలిసారి హత్యకేసు, అక్రమంగా ఆయుధాలను కలిగి ఉండటం అభియోగాలతో పోలీసు కేసు నమోదయ్యే సమయానికి అతని వయసు కేవలం 17 సంవత్సరాలు!
సొంతంగా కొన్ని హత్యలు చేసిన తర్వాత మున్నా బజ్రంగి జాన్పూర్లోని గజ్రాజ్ సింగ్ గ్యాంగ్లో చేరాడు. 'మిర్జాపూర్ 2'లో జాన్పూర్ పేరు కూడా మనం చూశాం. 1990లలో ముఖ్తార్ అన్సారీ గ్యాంగ్తో కలిశాడు మున్నా. పూర్వాంచల్ ప్రాంతంలో అన్సారీ గ్యాంగ్ సమాంతర పాలన సాగించిందంటారు. మావూ రీజియన్ నుంచి ఆ గ్యాంగ్ కార్యకలాపాలు నడిచేవి.
గ్యాంగ్ పోరులో భాగంగా బీజేపీ లీడర్ కృష్ణప్రసాద్ రాయ్ను మున్నా, అన్సారీ, వాళ్ల గ్యాంగ్ సభ్యులు కలిసి హత్య చేశారు. పట్టపగలు ఆరు ఏకే-47 రైఫిల్స్తో, 400 బుల్లెట్లతో రాయ్ శరీరాన్ని జల్లెడ మాదిరి చిల్లులు పడేట్లు కాల్చి చంపారు. అప్పట్లో ఆ ఘటన ఉత్తరప్రదేశ్ వ్యాప్తంగా అది పెను సంచలనం కలిగించింది.
రాయ్ను హత్య చేశాక మున్నా తన ఫ్యామిలీతో ముంబైకి మకాం మార్చాడు. 40కి పైగా హత్యలు, దోపిడీ కేసులున్న మున్నా ఆచూకీ తెలిపిన వారికి రూ. 7 లక్షల రివార్డును సైతం ప్రకటించారు. చివరకు ముంబై పోలీసుల సహకారంతో ఢిల్లీ పోలీసులు 2009లో ముంబైలో పట్టుకున్నారు.
జైలులో ఉండే 2012 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అప్నా దళ్ పార్టీ అభ్యర్థిగామరియాహు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయాడు మున్నా. క్రిమినల్ గ్యాంగ్స్తో, పొలిటీషియన్స్తో ఉన్న సంబంధాల కారణంగా అతడిని తరచూ ఒక జైలు నుంచి మరో జైలుకు మారుస్తూ వచ్చారు.
2018 జూలైలో బాఘ్పట్ జైలులో సహ ఖైదీ, ప్రత్యర్థి గ్యాంగ్ సభ్యుడైన సునీల్ రాఠీ చేతిలో హత్యకు గురయ్యాడు మున్నా బజ్రంగి. హత్యకు ఒకరోజు ముందే ఒక దోపిడీ కేసులో కోర్టులో హాజరుపర్చడం కోసం బాఘ్పట్ జైలుకు అధికారులు తరలించారు. ఇది పథకం ప్రకారం చేసిన హత్య అంటూ ఆరోపణలు వచ్చాయి. ఈ కేసును ప్రస్తుతం సీబీఐ దర్యాప్తు చేస్తోంది. కాగా, మున్నా బజ్రంగి నిజ జీవిత ఘటనల ఆధారంగా 'మిర్జాపూర్' సిరీస్లోని మున్నా భయ్యా పాత్రను కల్పించామని దాని నిర్మాతలు ఎప్పుడూ ప్రకటించలేదు. మున్నా భయ్యా పాత్రను దివ్యేందు శర్మ పోషించాడు.
Also Read