సెన్సార్ అయిన తర్వాత.. ఈ గోలేంటి?
on Oct 21, 2017
‘మెర్సల్’.. ప్రస్తుతం తమిళనాట సంచలనం. చాలాకాలం తర్వాత తమిళ బాక్సాఫీస్ ని రఫాడించేస్తుందీ సినిమా. ప్రపంచవ్య్తాప్తంగా వసూళ్లే వసుళ్లు. అంచనాలేంటో ప్రస్తుతం చెప్పుకోలేని పరిస్థితి. విజయ్ హీరోగా నటించిన ఈ చిత్రం హిట్ టాక్ తో దూసుకుపోతుంటే... ‘ఇందులో అభ్యంతకరమైన సంభాషణలు, సన్నివేశాలు ఉన్నాయ్. అవి ప్రభుత్వ వైద్యులను కించపరిచేలా ఉన్నాయ్. వాటిని వెంటనే తొలగించాలి’ అంటూ తమిళనాడు వైద్యులు అక్కడ పోరాటం చేస్తుండటంతో రాజకీయంగా కూడా ఈ సినిమా వేడిని రగిల్చింది. మరో వైపు బీజేపీ పెద్దలు కూడా ‘దేశాభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న జీఎస్టీ విధానంపై కూడా ఈ సినిమాలో విమర్శలు గుప్పించడం దారుణం’అనీ... ‘వీటిని వెంటనే తొలగించాలి’ అని ఉద్యమాలు చేస్తున్నారు. ఈ కారణాల వల్ల ‘మెర్సల్’కి ఇంకాస్త పబ్లిసిటీ పెరిగింది.
అయితే... ఈ వ్యవహారంపై కమల్ హాసన్ స్పందించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. అసలే రాజకీయ పార్టీ పెడుతున్నట్లు ప్రకటించి తమిళ రాజకీయాల్లో సంచలనంగా మారిన కమల్... ‘మెర్సల్’ సినిమా విషయంలో పాజిటీవ్ గా స్పందించారు. ‘సెన్సార్ పూర్తి చేసుకొని వచ్చిన సినిమాపై పోరాటాలు చేయడం తగదు. పూర్తిగా సెన్సార్ సభ్యులు ఆమోదించిన తర్వాతే సినిమా విడుదలైంది. అలాంటప్పుడు ఈ విమర్శలన్నీ అర్థరహితం’ అని కొట్టి పారేశారు. గతంలో కమల్ కూడా జీఎస్టీ వ్యవహారాన్ని తప్పుపట్టిన విషయం తెలిసిందే.
సామాంజిక సమస్యల నేపథ్యంలో దర్శకుడు అట్లె తెరకెక్కిన ‘మెర్సల్’ చిత్రం... ఈ స్థాయి సంచలనంగా మారడానికి కారణం.. అందులో దర్శకుడు టచ్ చేసిన అంశాలే. తమిళనాట వైద్యరంగంలో నెలకొన్న సమస్యలన్నింటినీ ఈ చిత్రం ఏకరవు పెడుతుంది. ప్రభుత్వాసుపత్రుల నిర్లక్ష్యం.. డాక్టర్ల ధనదాహం.. ఈ చిత్రంలో కొట్టొచ్చినట్టు చూపించారట. మరో వైపు కేంద్ర ప్రభుత్వ జీఎస్టీ విధానాన్ని కూడా వెండితెర సాక్షిగా ఎండగట్టాడట దర్శకుడు. జీఎస్టీపై విజయ్ చెప్పే డైలాగులు సినిమాకే హైలైట్ అని తెలిసింది. బీజేపీ నాయకులు తప్పుపడుతుంది ఇప్పుడు ఆ డైలాగుల గురించే. త్వరలో ‘మెర్సల్’.. ‘అదిరింది’గా తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి తమిళనాడులో రగలించిన వేడిని ఇక్కడ కూడా రాజేస్తుందా? పేరుకు తగ్గట్టే ‘అదిరింది’ అనిపిస్తుందా? ఈ ప్రశ్నలకు సమాధానం కావాలంటే... ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.