"మహానటి" గురించి మాయాపేటిక ఏం చెప్పిందంటే..!!
on Dec 7, 2017
నాటి నుంచి నేటి వరకు హీరోయిన్ల నటనకు కొలమానం అంటే సావిత్రి గారే. మరణించి ఏన్నో ఏళ్లు అవుతున్నా.. చరిత్రలో నిలిచిపోయే ప్రతిభతో ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టారు మహానటి సావిత్రి. హావభావాలతో నటించేవారు కొందరైతే.. కేవలం కళ్లతోనే నవరసాలను పలికించగల గొప్పనటి సావిత్రి.. అందుకే ఆమె మహానటి అయ్యింది. ఎంతమంది నటీమణులు వచ్చినా.. సావిత్రి ప్లేస్ని రీప్లేస్ చేయలేకపోయారంటే ఆమె వెండితెరపై ఎలాంటి ముద్ర వేశారో అర్థమవుతుంది. ప్రతిభ, మంచితనం, అమాకత్వం, మూర్ఖత్వం, అదృష్టం, దురదృష్టం, విషాదం.. ఇలా ఒక సినిమా కథకు కావల్సిన ట్విస్టులు సావిత్రి వ్యక్తిగత జీవితంలో కోకొల్లలు.
అసలే బయోపిక్ల సీజన్ కదా.. మరి సినిమా వాళ్లు ఆమెను విడిచిపెడతారా..? సావిత్రి జీవితకథను సినిమాగా తెరకెక్కించాలని ఎంతోమంది దర్శకదిగ్గజాలు ప్రయత్నించారు.. కానీ అది సెట్స్ మీదకు వెళ్లేదు. అయితే ఎవడే సుబ్రమణ్యం ఫేం నాగ్ అశ్విన్ మాత్రం పట్టుదలతో స్క్రిప్ట్ రెడీ చేసి దానిని పట్టాలెక్కించాడు. అదే "మహానటి" అశ్వినీదత్ కుమార్తె స్వప్నాదత్ ఈ మూవీని నిర్మిస్తుండగా.. కిర్తీ సురేష్ సావిత్రి పాత్రను పోషిస్తున్నారు. సావిత్రి పుట్టినరోజును పురస్కరించుకొని చిత్రయూనిట్ అభిమానుల కోసం మహానటి వీడియో లోగోని రిలీజ్ చేసింది. మాయాబజార్ సినిమాలో మాయాపేటికను ఓ అమ్మాయి వచ్చి ఓపెన్ చేయగానే.. "సమ్ స్టోరీస్ ఆర్ మీన్ టుబీ ఎపిక్" అంటూ.. మహానటి లోగో వస్తుంది. మహానటి లోగో ప్లే అవుతుండగా వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకుంటుంది. సమ్మర్ కానుకగా 2018 మార్చి 29న మహానటి విడుదలకానుంది.