నివేదా.. అచ్చొచ్చిన స్క్రీన్ నేమ్
on Apr 12, 2021
తెలుగునాట పరిమిత సంఖ్యలోనే సినిమాలు చేసినా.. మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది కేరళకుట్టి నివేదా థామస్. తొలి చిత్రం `జెంటిల్ మన్` (2016) మొదలుకుని తాజా చిత్రం `వకీల్ సాబ్` వరకు ప్రతీ సినిమాలోనూ పాత్ర నిడివితో సంబంధం లేకుండా తనదైన అభినయంతో మురిపించింది నివేదా. మరీ ముఖ్యంగా.. `జెంటిల్ మన్`, `నిన్ను కోరి`, `118`, `బ్రోచేవారెవరు రా`, `వకీల్ సాబ్`లో నివేదా నటన అటు ప్రేక్షకుల, ఇటు విమర్శకుల ప్రశంసలు పొందింది.
ఇదిలా ఉంటే.. కన్నడంలో మినహాయిస్తే దక్షిణాదిలోని అన్ని భాషల్లోనూ నటించిన నివేదా థామస్.. తన కెరీర్ మొత్తమ్మీద ఒకే పాత్ర పేరు (స్క్రీన్ నేమ్)తో రెండు సినిమాలు చేసిన సందర్భం లేదు. అయితే.. తాజాగా తెలుగులో ఆ ముచ్చట చోటుచేసుకుంది. `నిన్ను కోరి`లో పల్లవి పాత్రలో మెస్మరైజ్ చేసిన నివేదా.. `వకీల్ సాబ్`లోనూ అదే పేరుతో పలకరించింది. రెండు సందర్భాల్లోనూ నటిగా మంచి గుర్తింపుని పొందడమే కాకుండా.. విజయాలను కూడా సొంతం చేసుకుంది.
మొత్తమ్మీద.. నివేదాకి `పల్లవి` అనే స్క్రీన్ నేమ్ బాగానే అచ్చొచ్చిందన్నమాట.