వ్యూస్ కోసం చంపేస్తారా..?
on Nov 11, 2017
ఇటీవలీ కాలంలో ఆన్లైన్ సంపాదనపై జనం ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారు. వాటిలో ఫస్ట్ ప్లేస్లో నిలిచేది యూట్యూబ్.. యూట్యూబ్లో కంటెంట్ అప్లోడ్ చేసేవారికి డబ్బు చెల్లిస్తోంది ఆ సంస్థ. దీంతో యూత్ ఇప్పుడు యూట్యూబ్ బాటపడుతున్నారు. జనాల చేతికి స్మార్ట్ఫోన్స్ వచ్చాక.. వాటిలో హైక్వాలిటీ కెమెరాలు ఉండటంతో వీడియోలు తీసి.. వాటిని యూట్యూబ్లో అప్లోడ్ చేసేస్తున్నారు. ఇలా చేస్తే సులభంగా డబ్బు సంపాదించొచ్చనే విషయం ఆ నోటా.. ఈ నోటా తెలియడంతో ఇప్పుడు ప్రతీ ఒక్కరు యూట్యూబ్ ఛానెల్ ఓపెన్ చేసేస్తున్నారు.
ఈ పోటీలో ఛానెల్కి వ్యూస్ రావడం కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో వ్యూస్ కోసం లేనిపోని పుకార్లను సృష్టిస్తున్నారు జనాలు. ముఖ్యంగా హీరోహీరోయిన్లకు అక్రమ సంబంధాలు అంటకట్టడమో.. ఎవరో ఒక పెద్దాయనకు ఆరోగ్యం బాగోపోతే బతికున్న వ్యక్తిని చనిపోయినట్లు ప్రచారం చేస్తున్నాయి సదరు ఛానెళ్లు. ఈ విషయం ఎన్నో సార్లు రుజువైంది. తాజాగా తెలుగు చిత్రసీమలో విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న కోటా శ్రీనివాసరావు ఆరోగ్యం అత్యంత విషమంగా ఉందని కొద్దిరోజుల నుంచి కొన్ని యూట్యూబ్ ఛానెళ్లలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. దీంతో నాకు ఏం కాలేదు.. నేను బాగానే ఉన్నానని స్వయంగా కోటా శ్రీనివాసరావే వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. కేవలం వ్యూస్ కోసం బతికున్న మనుషులను చంపేసే స్థాయికి దిగజారడం సమాజానికి తప్పుడు సంకేతాలు పంపిస్తుందని నిపుణులు అంటున్నారు.