ఖాన్స్ కంటే బాలీవుడ్ యంగ్ హీరోలు బెటర్
on Mar 31, 2020
కరోనాపై యుద్ధానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఏర్పాటు చేసిన 'పీఎం కేర్స్ ఫండ్'కి అక్షయ్ కుమార్ రూ. 25 కోట్ల విరాళం ఇచ్చిన తరవాత... అందరి చూపు బాలీవుడ్ ఖాన్ త్రయం మీద పడింది. షారుక్, సల్మాన్, ఆమిర్ ఎంత ఇచ్చారని ఆరాలు తీయడం మొదలైంది. ఏమీ ఇవ్వలేదని తెలిసి విమర్శలు వస్తున్నాయి. ఖాన్ త్రయంలో కొంతలో కొంత సల్మాన్ సహాయం చేశాడు. పాతికవేల మంది సినీ కార్మికుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ చేయడానికి ముందుకొచ్చాడు. అది అభినందించదగ్గ విషయం. మిగతా ఇద్దరు ఖాన్స్.. షారుక్, ఆమిర్ అసలు ఏమాత్రం చప్పుడు చేయడం లేదు. ఏదో విధంగా కరోనా కారణంగా ఇబ్బంది పడుతున్న వారికి సల్మాన్ తరహాలో సహాయం చేయవచ్చు. అదీ చేయడం లేదు.
ఖాన్స్ కంటే యంగ్ హీరోలు బెటర్ అనిపిస్తున్నారు. నిన్న మొన్న వచ్చిన హీరోలు కోట్లు, లక్షలు సహాయం చేస్తున్నారు. ప్రధానమంత్రి సహాయనిధికి యువ హీరోల్లో విక్కీ కౌశల్, కార్తీక్ ఆర్యన్ కోటి రూపాయల చొప్పున ఇవ్వనున్నట్టు ప్రకటించారు. వరుణ్ ధావన్ రూ. 30 లక్షల విరాళాన్ని ప్రకటించాడు. ఆయుష్మాన్ ఖురానా కూడా విరాళం ఇస్తానని తెలిపాడు. టీవీ ఇండస్ట్రీ నుండి కపిల్ శర్మ రూ. 50 లక్షలు, మనీష్ పాల్ రూ. 20 లక్షలు ప్రకటించారు. వీళ్ళకంటే మంచి స్థాయిలో ఉన్న ఖాన్ హీరోలు ఇంకా విరాళం ప్రకటించకపోవడం చర్చనీయాంశం అవుతోంది. నరేంద్రమోదీ అంటే బాలీవుడ్ ఇండస్ట్రీలో కొందరికి పడదని గుసగుస. అటువంటివి ఏవైనా ఉన్నప్పటికీ పక్కనపెట్టి మంచి మనసుతో ముందుకు రావలసిన సమయం ఇది.