కూల్డ్రింక్లో మత్తుమందు కలిపి సినీనటిపై అత్యాచారం
on Jul 5, 2020
పలు చిత్రాలలో నటించిన బహు భాషా నటిపై కార్పొరేట్ కంపెనీ సీఈఓ ఒకరు అత్యాచారానికి పాల్పడిన ఘటన బెంగళూరులో చోటు చేసుకుంది. తనకు ఎదురైన చేదు అనుభవం గురించి ఆ నటి నేరుగా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, బెంగళూరు పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు చెప్పిన దాని ప్రకారం.. 30 సంవత్సరాల బాధిత నటి బెంగళూరులోని జేజే నగర్లో ఓ అపార్ట్మెంట్లో నివాసముంటున్నారు. ఆమె పలు తమిళ, కన్నడ చిత్రాలలో నటించారు. 2018లో బసవనగుడి ప్రాంతంలోని గాంధీబజార్లో సదరు కార్పొరేట్ కంపెనీ సీఈఓ మోహిత్ పరిచయమయ్యాడు. అప్పట్నుంచీ ఆమెతో సన్నిహితంగా మెలగుతూ వచ్చాడు. ఆమెను తమ కంపెనీ బ్రాండ్ అంబాసిడర్గా నియమించాడు. ఆ క్రమంలో ఆ ఇద్దరూ గోవా, మరికొన్ని ప్రదేశాలలో పర్యటించారు.
కొద్ది రోజుల తర్వాత తమ కంపెనీ ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని ఆమెను నమ్మించి, ఆమె దగ్గర కొంత డబ్బు వసూలు చేశాడు. 2019 జూన్ 22 తన పుట్టినరోజంటూ మోహిత్ తన ఇంట్లో ఆమెకు పార్టీ ఇచ్చాడు. మరుసటి రోజు నటి పుట్టినరోజు కావడంతో ఇద్దరూ పార్టీ చేసుకున్నారు. అప్పుడే మోహిత్ కూల్డ్రింక్లో మత్తుమంతు కలిపి ఇచ్చాడనీ, తను మత్తులోకి వెళ్లాక అతను తనపై అత్యాచారం చేశాడనీ పోలీసులకిచ్చిన ఫిర్యాదులో ఆ నటి పేర్కొన్నారు.
తనపై అత్యాచారం చేసిన తతంగాన్నంతా అతను సెల్ఫోన్లో వీడియో తీసి, బ్లాక్మెయిల్ చేస్తూ వచ్చాడని ఆమె ఆరోపించారు. ఆ వీడియోను చూపి బెదిరిస్తూ.. ఇప్పటివరకూ రూ. 20 లక్షల వరకూ తన నుంచి బలవంతంగా గుంజాడని ఆమె తెలిపారు. మోహిత్ బెదిరింపులు పెరిగిపోవడంతో, అతని తల్లిదండ్రులను కలిసి తన బాధలు చెప్పుకుంటూ, వారూ బెదిరించారని ఆమె తన ఫిర్యాదులో ఆవేదన వ్యక్తం చేశారు. నటిని మోసం చేసి, అత్యాచారం చేసిన కేసులో పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు. పరారీలో ఉన్న మోహిత్ కోసం వేట సాగిస్తూ, అతని తల్లిదండ్రులను ప్రశ్నిస్తున్నారు.
Also Read