అక్క కాజల్ పెళ్లి గురించి చెల్లి నిషా ఏం చెప్పిందంటే...
on Oct 27, 2020
మరో రెండు రోజుల్లో గౌతమ్ కిచ్లుతో కలిసి ఏడడుగులు నడిచేందుకు సిద్ధమవుతోంది కాజల్ అగర్వాల్. ఈ సందర్భంగా అక్క పెళ్లి గురించిన వివరాలను చెల్లెలు నిషా అగర్వాల్ వెల్లడించింది. "చాలా కాలం నుంచి కాజల్ పెళ్లి చేసుకొనే రోజు కోసం మా నాన్న ఎదురుచూస్తూ వస్తున్నారు. కాబట్టి మా అందరికీ ఇది స్పెషల్ టైమ్. కాజల్ పెళ్లిచేసుకొని, కాపురానికి వెళ్లనుందని తలచుకుంటేనే మేము కాస్త ఉద్వేగానికి గురవుతున్నాం. అందుకే ఈ టైమ్లో తనతో సాధ్యమైనంత సమయం గడపడానికి ప్రయత్నిస్తున్నాం. కానీ అందరూ అదే పనిలో ఉండటంతో నాకెక్కువగా తనతో గడపడానికి వీలవట్లేదు" అని తెలిపింది నిషా.
ముంబైలోని అగర్వాల్ నివాసంలో పసుపు కుంకుమ, గోరింటాకు ఫంక్షన్లు జరుగనున్నాయి. "కొవిడ్-19 మహమ్మారి కారణంగా, వేడుకను మేం నిరాడంబరంగా జరుపుతున్నాం. ఆ ప్రదేశంలో నిబంధనలు ఉన్నప్పటికీ, పెళ్లి వాతావరణం సృష్టించడానికి వీలైనంతగా ప్రయత్నిస్తున్నాం. పెళ్లికి ఒకరోజు ముందుగా.. అంటే అక్టోబర్ 29న పసుపు-కుంకుమ, గోరింటాకు వేడుకలు జరుపబోతున్నాం. కాజల్ విషయంలో మేమంతా చాలా థ్రిల్ ఫీలవుతున్నాం. అలాగే తను కొత్త ప్రయాణం మొదలుపెట్టబోయే క్షణాల కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాం" అని వెల్లడించింది నిషా అగర్వాల్.
గౌతమ్ కిచ్లును కాజల్ భర్తగా ఆహ్వానిస్తున్నందుకు తమ ఫ్యామిలీ అంతా చాలా సంతోషంగా ఉందనీ, అతను గ్రేట్ పర్సన్ అనీ ఆమె చెప్పింది. "నిరాడంబరంగా జరుగుతున్నప్పటికీ, పెళ్లి అనేది ప్రత్యేకమైంది. అంతవరకు కచ్చితంగా చెప్పగలను. పెళ్లిరోజు చిన్నపాటి సంగీత్ను ప్లాన్ చేశాం. పాటలు, డాన్సులు, సరదాలు, నవ్వులు, ప్రేమలు అన్నీ అందులో ఉంటాయి" అని వివరించింది నిషా.
Also Read