మళ్లీ ఎన్టీఆర్ హ్యాండిచ్చేసినట్టేనా?
on Aug 30, 2016
ఎన్టీఆర్ కోసం రెండేళ్లుగా ఎదురుచూస్తున్నాడు వక్కంతం వంశీ. మద్యలో దర్శకుడిగా తనకు ఎన్ని అవకాశాలు వచ్చినా ఎన్టీఆర్ కోసం పక్కన పెట్టేశాడు. టెంపర్ కథకు దర్శకుడు వక్కంతం వంశీనే. కానీ ఆ సమయంలో ఎన్టీఆర్ - పూరి జగన్నాథ్ల కోసం తన కథని త్యాగం చేశాడు. నాన్నకు ప్రేమతో తరవాత వక్కంతంతో సినిమా ఖాయమనుకొన్నారు. కానీ.. జనతా గ్యారేజ్ మొదలైపోయింది. జనతా తరవాత వక్కంతంతో తప్పకుండా ఎన్టీఆర్ సినిమా చేస్తాడని చెప్పుకొన్నారు. ఈ సినిమాకు కల్యాణ్ రామ్ నిర్మాత అని అనుకొన్నారు. ధడ్కన్ అనే పేరు పెట్టారన్న వార్తలూ వచ్చాయి. అయితే అవేం లేవట. అసలు వక్కంతంతో సినిమా కూడా డౌటే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు.
జనతా గ్యారేజ్ తరవాత.. ఎలాంటి సినిమా చేయాలన్న విషయంలో ఎన్టీఆర్ ఇంకా ఓ క్లారిటీకి రాలేదని తెలుస్తోంది. వక్కంతం తో సినిమా చేయాలన్న ఆలోచనని ఎన్టీఆర్ ప్రస్తుతానికి పక్కన పెట్టేశాడని సమాచారం. జనతా గ్యారేజ్ తరవాత ఓ పెద్ద దర్శకుడితోనే సినిమా ఉంటుందని తెలుస్తోంది. ఎన్టీఆర్ అయితే.. జనతా గ్యారేజ్ తరవాత విశ్రాంతి తీసుకోవాలన్న ఆలోచనలో ఉన్నాడు. కనీసం రెండు నెలలు బ్రేక్ తీసుకొని... ఆ తరవాతే కొత్త సినిమా మొదలెడతాడట. ఈలోగా కావల్సినన్ని కథలు వినొచ్చన్నది ఎన్టీఆర్ ఆలోచన. మొత్తానికి తన కోసం రెండేళ్లుగా ఎదురుచూస్తున్న వక్కంతంకి.. ఎన్టీఆర్ మళ్లీ హ్యాండిచ్చినట్టే.