ఎన్టీఆర్ మాట్లాడడేం..??
on Aug 26, 2016
పవన్ కల్యాణ్ అభిమానిని ఎన్టీఆర్ ఫ్యాన్స్ కత్తితో పొడిచి చంపడం ఇండ్రస్ట్రీ వర్గాల్లో కలకలం రేపింది. అభిమానుల మధ్య వైరం ఇలానే పెరిగిపోతే ఏం జరుగుతుందో అనే భయం నెలకొంది. పరిస్థితిని చక్కదిద్దడానికన్నట్టు పవన్ కల్యాణ్ రంగంలోకి దిగి... హీరోలు సఖ్యతగానే ఉంటారని, తమ మధ్య గొడవల్లేవని, ఫ్యాన్స్ కూడా అభిమానాన్ని హద్దుల్లో ఉంచుకోవాలని సూచించాడు. అభిమాని కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చాడు. అయితే ఇప్పటి వరకూ ఎన్టీఆర్ మాత్రం ఈ విషయంలో స్పందించకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. నిజానికి ఇలాంటి సున్నిశిత విషయాల్లో ఎన్టీఆర్ కాస్త అప్రమత్తంగానే ఉంటాడు. ఫ్యాన్స్ విషయాల్లో ఎప్పటికప్పుడు స్పందిస్తాడు. జనతా గ్యారేజ్ ఆడియో ఫంక్షన్లో కూడా అభిమానుల్ని హెచ్చరించాడు. పాలాభిషేకాలు, జంతు బలులు ఇవ్వొద్దని కోరాడు. ఈ విషయంలోనూ ఎన్టీఆర్ స్పందించి ఉంటే బాగుండేది. జనతా గ్యారేజ్ ప్రమోషన్ల కోసం ఎలాగూ మీడియా ముందుకు వస్తాను కదా, అప్పుడు మాట్లాడుకొందాం అనుకొన్నాడేమో. లేదంటే అసలు ఇది చాలా సెన్సిటీవ్ మేటర్ .. ఇలాంటి విషయాల్లో ఆచి తూచి స్పందించాలని భావించి ఉంటాడు. దానికి తోడు ఈ హత్యని కేవలం అభిమానం కోణంలో చూడడం కూడా ఎన్టీఆర్కి నచ్చకపోయి ఉండొచ్చు. అయితే ఎన్టీఆర్ ఎప్పుడు మీడియా ముందుకొచ్చినా ఈ ప్రశ్న నుంచి దాటుకెళ్లడం కష్టం. అదేదో.. ఇప్పుడే చెప్పేస్తే ఓ క్లారిటీ వచ్చేద్దును కదా?? ఆలస్యంగా స్పందిచాడు.. అనే నింద కూడా తప్పేది.