ఎన్టీఆర్ అభిమానులకు నోటీసులు...
on Jun 6, 2020
మీరా చోప్రాను ట్విట్టర్లో దూషించిన, బెదిరింపులకు పాల్పడి వేధించిన పదిహేను మందికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. త్వరలో వారిని ఆరెస్ట్ చేయవచ్చని తెలుస్తోంది. గతేడాది మీరా చోప్రా హిందీలో ఓ సినిమా చేయడం, ప్రస్తుతం హిందీలో ఆమె నటించిన మరో సినిమా పోస్ట్ ప్రొడక్షన్లో ఉండడం, పైగా ఫేమస్ హీరోయిన్ ప్రియాంకా చోప్రాకు కజిన్ కావడంతో ఈ వివాదంపై జాతీయ మీడియా దృష్టి పెట్టింది. మీరా చోప్రా కూడా ట్విట్టర్లో కేటీఆర్, ఏపీ సీయం జగన్ తదితరులకు ట్యాగ్స్ చేశారు. జాతీయ మహిళా హక్కుల కమిషన్ అధ్యక్షురాలు రేఖా శర్మ సైతం మీరా చోప్రాకు అండగా నిలబడ్డారు. టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో పోలీసులు త్వరగా ట్విట్టర్ అకౌంట్స్ ఎవరివో గుర్తించారు. వాళ్లకు నోటీసులు పంపించారు. మరోవైపు ఎన్టీఆర్ అభిమానులు కొందరు, దూషణలకు పాల్పడ్డ వ్యక్తులపై మండిపడుతున్నారు. జాతీయస్థాయిలో అభిమాన హీరో పేరు పాడు చేసేలా వ్యవహరించినందుకు బాధపడుతున్నారు. సోషల్ మీడియాలో స్టార్స్ను చాలామంది చాలా రకాలుగా వేధిస్తున్నారు. అయితే, మీరా చోప్రా వివాదం వార్తల్లో నిలిచినంతగా ఎవరిదీ నిలవలేదు. చేతిలో స్మార్ట్ ఫోను, సోషల్ మీడియా అకౌంట్ ఉందని అనుచితంగా ప్రవర్తించే వాళ్లకు ఈ ఘటన కనువిప్పు కలిగిస్తుందని చెప్పవచ్చు.
Also Read