పవన్ పోరాటం... మూడు సూత్రాలు
on Aug 27, 2016
స్పెషల్ స్టేటస్ కోసం పవన్ కల్యాణ్ ఏం చేయబోతున్నాడు? ప్రభుత్వాన్ని ఎలా ఇరకాటంలో పెట్టబోతున్నాడు? అసలు పవన్ కార్యాచరణ ప్రణాళిక ఏమిటి? ఈ విషయాలపై పవన్ స్పందించాడు. తిరుపతి సభలో పవన్ మాట్లాడుతూ మూడు దశల కార్యాచరణ ప్రణాళిక ఏమిటో స్పష్టం చేశాడు. ఈ సభలో పవన్ మాట్లాడుతూ ''సీమాంధ్రులంటే అందరికీ అంత చులకనా? పౌరుషం లేనివాళ్లా? మరి కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఆడుకొంటోంది? మీ అందరిలో చావ లేదు.. మీలో పౌరుషం లేదు.. అంటున్నారు. కానీ మనకి దేశం పట్ల ప్రేమ ఉంది, నిబద్దత ఉంది. అందుకే సహనంతో ఉంటాం. ఇప్పటి వరకూ అన్ని ప్రభుత్వాలూ సీమాంధ్రుల ప్రేమ చూశారు.. సీమాంధ్రుల సహనం చూశారు... ఇచ్చిన మాట వెనక్కి తీసుకొంటే సీమాంధ్రుల పోరాటం చూస్తారు. సీమాంధ్రుల పౌరుషం చూస్తారు. దేశమంతా ఇటు చూసేలా ఏం చేస్తామో.. వాళ్లు చూస్తారు.
కాంగ్రెస్ రాష్ట్ర్రాన్ని పద్దతి, పాడు లేకుండా విడగొట్టారు. ఇక్కడున్న యువతకు ఏం చేయాలో ఆలోచించలేదు. మీ చావు మీరు చావండి.. అంటూ విడగొట్టేశారు. బీజేపీ కూడా తక్కువ కాదు. తక్కువ తప్పేం చేయలేదు. ఏపీకి జరిగిన నష్టం గురించి ఏం మాట్లాడడం లేదు. ఎంతకాలం నేను కూడా కామ్గా ఉంటా.? గెలిపొందిన ఎంపీలున్నారు.. రాష్ట్ర్రానికి ముఖ్యమంత్రులున్నారు.. మంత్రులున్నారు.. ఇక్కడి నుంచి గెలిపొందిన ప్రజా ప్రతినిధులున్నారు.. అందరూ కలసి పార్లమెంటులో పోరాటం చేస్తారనుకొన్నారనుకోంటే.. గడియకో మాట మాట్లాడుతున్నారు. 'మేడమ్ ప్లీజ్ మేడం' అంటూ కాంగ్రెస్ ఎంపీలు.. 'ప్లీజ్ సార్.. ప్లీజ్ సార్' అంటున్నారు. ఏనుగుపై వర్షం పడుతున్నట్టు ఏ స్పందన లేదు. ఈ విషయమై నేను ట్వీట్లు చేశా. రోడ్లపైకొచ్చి ఉద్యమాలు చేసే పరిస్థితికి తీసుకురావొద్దని ట్వీట్ చేశా. కానీ పట్టించుకోలేదు.
అందుకే మూడు దశల కార్యాచరణ ప్రణాళిక రూపొందించా. అన్ని జిల్లాలు తిరిగి.. మనకు జరిగిన ద్రోహమేంటో చెప్తా. ప్రశ్నించడానికి వచ్చానన్నా కదా.. ఇప్పుడు ప్రశ్నిస్తా. ఎక్కడైతే బీజీపీ రాష్ట్ర్రాన్ని విడగొట్టాలని చూసిందో అదే కాకినాడలో మీటింగ్ పెడతా. రెండో దశలో రాష్ట్ర ప్రభుత్వంపై, అధికార ఎంపీలు, ప్రతిపక్ష పార్టీల ఎంపీలపై ఒత్తిడి తీసుకొచ్చేలా ప్రయత్నిస్తా. అప్పటికీ ఎంపీలు పోరాటాలు చేయని పక్షంలో.. మీ అందరి సలహాలతో, మీ అనుమతితో రోడ్ల మీదకి వస్తా'' అన్నాడు పవన్