కేటుగాళ్లతో లావాదేవీలకు నేను బాధ్యుడిని కాదు.. హెచ్చరించిన అజిత్!
on Sep 17, 2020
కోలీవుడ్ అగ్ర హీరోల్లో ఒకడైన అజిత్ తన లేటెస్ట్ ఫిల్మ్ 'వాలిమై' షూటింగ్ను ఈ నెలాఖరు నుంచి కొనసాగించేందుకు సిద్ధమవుతున్నాడు. 15 రోజుల పాటు షెడ్యూల్ నిర్వహించాలనేది యూనిట్ ప్లాన్. హెచ్. వినోద్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా కోసం అభిమానులు అమితాసక్తితో ఎదురు చూస్తున్నారు. సాధారణంగా వ్యక్తిగత విషయాల్లో గుంభనంగా వ్యవహరించే అతను.. అవసరమనుకుంటేనే దేని గురించైనా ప్రకటనలు జారీ చేస్తుంటాడు.
తాజాగా అతను తన ప్రతినిధులమంటూ చెప్పి బిజినెస్ డీలింగ్స్ జరుపుతున్న వ్యక్తులకు లీగల్ నోటీస్ జారీ చేశాడు. టాలీవుడ్లో విజయ్ దేవరకొండ పేరు చెప్పి ఎలాగైతే తమిళ ప్రొడక్షన్ హౌస్ డస్కీ ఎంటర్టైన్మెంట్ ప్రతినిధులు హీరోయిన్లకు కాల్ చేసి వేధింపులకు గురి చేస్తూ వచ్చారో, అదే తరహాలో అజిత్ పేరు చెప్పి కొంతమంది వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తున్నట్లు అజిత్ దృష్టికి వచ్చింది. దాంతో ఆయన ఒక ప్రకటన వెలువరించాడు.
"మా క్లయింట్ (అజిత్కుమార్)కు ఎన్నో సంవత్సరాల నుంచీ ఏజెంట్గా సురేశ్ చంద్ర వ్యవహరిస్తున్నారు.అజిత్ తరపున ప్రొఫెషనల్, కమర్షియల్ ఎంగేజ్మెంట్స్ అన్నింటికీ తన ఏకైక అధికార ప్రతినిధిగా సురేశ్ చంద్రను మా క్లయింట్ నియమించారు. ఎవరైనా మా క్లయింట్ తరపు వ్యక్తులుగా కానీ, సంస్థలుగా కానీ క్లెయిమ్ చేసుకుంటున్న సమాచారం తెలిస్తే, దయచేసి సురేశ్ చంద్ర దృష్టికి తీసుకు వెళ్లండి. ఏ అనధికార డీలింగ్స్కు మా క్లయింట్ బాధ్యులు కారు. ఎవరైనా అనధికార వ్యక్తులతో లావాదేవీలు చేయదలచుకుంటే అందరూ జాగ్రత్తగా వ్యవహరించమని రిక్వెస్ట్ చేస్తున్నాం అని ఆ ప్రకటనలో తెలిపారు.
అదీ విషయం.. ఇవాళ పెద్ద పెద్ద హీరోల పేరు చెప్పి అమాయకులను మోసంచేసే కేటుగాళ్లు ఎక్కువైపోతున్నారు. అలాంటి వాళ్లతో లావాదేవీలు చేసే ముందు ఒకటికి నాలుగు సార్లు పరిశీలించుకోక తప్పదు.