నేనిప్పటికీ కల్యాణిని ప్రేమిస్తున్నా.. సూర్యకిరణ్ భావోద్వేగం!
on Sep 19, 2020
ఒకప్పుడు టాలీవుడ్లో కల్యాణి పాపులర్ హీరోయిన్. రాజశేఖర్ సరసన నటించిన 'శేషు' సినిమా ద్వారా టాలీవుడ్కు పరిచయమై, తొలి చిత్రంతోనే తన నటనతో ఆకట్టుకున్న ఆమె తన రెండో తెలుగు సినిమా 'ఔను.. వాళ్లిద్దరు ఇష్టపడ్డారు'లో నటనకు గాను ఉత్తమ నటిగా నంది అవార్డును అందుకుంది. వసంతం, కబడ్డీ కబడ్డీ, దొంగోడు, పెదబాబు, పందెం, ఆపరేషన్ దుర్యోధన వంటి హిట్ సినిమాల్లో నటించింది.
టాలీవుడ్లో సుమంత్ హీరోగా నటించిన 'సత్యం'తో డైరెక్టర్గా పరిచయమైన సూర్యకిరణ్తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారడంతో, ఆ ఇద్దరూ 2010లో పెళ్లి చేసుకున్నారు. సందర్భవశాత్తూ ఇద్దరూ మలయాళీలే. 'పసివాడి ప్రాణం'లో పసివాడిగా నటించిన సుజితకు సూర్యకిరణ్ స్వయానా సోదరుడు. సూర్యకిరణ్, కల్యాణి దంపతులకు ఇద్దరు పిల్లలు. ఆ తర్వాత పొరపొచ్చాలు రావడంతో విడాకులు తీసుకున్నారు. కానీ ఈ విషయాన్ని ఇద్దరిలో ఎవరూ బహిర్గతం చెయ్యలేదు. ఇండస్ట్రీలోని వారికి మాత్రం తెలుసు.
బిగ్ బాస్ 4లో తొలివారం ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్గా నిలిచిన సూర్యకిరణ్.. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో కల్యాణి, తాను విడాకులు తీసుకున్న విషయాన్ని వెల్లడించాడు. కల్యాణితో విడిపోవాల్సి వచ్చిన విషయంపై మాట్లాడాల్సి వచ్చినప్పుడు భావోద్వేగానికి గురయ్యాడు సూర్యకిరణ్. "నేనింకా ఆమెను ప్రేమిస్తున్నా. విడిపోవాలనేది నా డెసిషన్ కాదు. నాతో కలిసి జీవించకూడదని ఆమె నిర్ణయించుకుంది" అని అతను చెప్పాడు. ఆమెతో తనకు ఎలాంటి సమస్యలూ లేవనీ, తనతో కలిసి ఉండకూడదని నిర్ణయించుకోడానికి ఆమె కారణాలు ఆమెకు ఉన్నాయనీ సూర్యకిరణ్ తెలిపాడు.
Also Read