"కంగనకే నా సపోర్ట్" అంటున్న మాజీ ప్రియుడు!
on Sep 19, 2020
ఫియర్లెస్ లేడీగా బాలీవుడ్లో పేరుపొందిన కంగనా రనౌత్ ప్రస్తుతం సుశాంత్సింగ్ రాజ్పుత్ మృతి కేసులో తన వాయిస్ను బలంగా వినిపిస్తూ, అనేకమందితో మాటల యుద్ధం చేస్తోన్న విషయం తెలిసిందే. ఆమె చేస్తున్న పోరాటానికి తన మద్దతు ఉంటుందని ఆమె మాజీ బాయ్ఫ్రెండ్ అధ్యాయన్ సుమన్ ప్రకటించాడు. సీనియర్ యాక్టర్ శేఖర్ సుమన్ కొడుకైన అధ్యాయన్, కంగన కలిసి 'రాజ్: ద మిస్టరీ కంటిన్యూస్' సినిమాలో కలిసి నటించారు. ఆ సెట్స్ మీద చిగురించిన ప్రేమ రిలేషన్షిప్కు దారి తీసింది. ఆ రోజుల్లో ఎక్కడ చూసినా ఆ జంటే కనిపిస్తూ వచ్చారు. అయితే విధి మరొకటి తలచినట్లు ఇద్దరూ బాధాకరంగా విడిపోవాల్సి వచ్చింది.
సుశాంత్సింగ్ రాజ్పుత్ మృతి కేసులో నిజాలు బయటకు రావాలనీ, అతని కుటుంబానికి న్యాయం జరగాలనీ కంగన చేస్తున్న పోరాటానికి తన పూర్తి మద్దతు ఉంటుందని అధ్యాయన్ సుమన్ స్పష్టం చేశాడు. కంగన ఇప్పటికే చాలా పెద్ద నటి అనీ, కెరీర్ కోసం ఆమెకు ఎలాంటి పబ్లిసిటీ అవసరం లేదనీ అతనన్నాడు. "గత 12 సంవత్సరాలుగా నేను కంగనను ఫాలో కాలేదు. ఆమె సక్సెస్ఫుల్ అయిన పాపులర్ యాక్టర్. ఆమె పబ్లిక్లోకి వచ్చి, తన అభిప్రాయాలు చెప్పిందంటే, కచ్చితంగా దానికో రీజన్ ఉంటుందనేది నా నమ్మకం. ఆమెకు పబ్లిసిటీ అవసరం లేదు. తను చెప్పాలనుకున్న విషయాన్ని చెబుతోంది.. ఒక విషయంపై తన ఆగ్రహాన్ని వ్యక్తం చేయాలనుకుంటోంది కాబట్టే మాట్లాడుతోంది. అది కంప్లీట్గా ఆమె అభిప్రాయం. దాన్ని నేను గౌరవిస్తాను." అని చెప్పాడు అధ్యాయన్.
కంగనతో తనకు ఎలాంటి రిలేషన్షిప్ లేదని అతను స్పష్టం చేశాడు. ఏదేమైనా జీవితం అనేది తమ ఇద్దరినీ పరస్పరం వ్యతిరేకించని ఒకే వైపుకు తీసుకొచ్చిందని అతను చెప్పాడు. కాగా, అధ్యాయన్ తండ్రి శేఖర్ సుమన్ సైతం చాలా రోజులుగా కంగన మాదిరిగానే సుశాంత్సింగ్ మృతి విషయంలో అనుమానాలున్నాయనీ, అతడిది ఆత్మహత్య చేసుకొనే మనస్తత్వం కాదనీ వాదిస్తూ వస్తున్నాడు.