రాజశేఖర్ యాక్సిడెంట్ వెనుక కథ?
on Oct 9, 2017
డా. రాజశేఖర్కి యాక్సిడెంట్ అయ్యింది. స్వల్ప గాయాలతో ఆయన బయట పడ్డాడు. ఈ వార్త సోమవారం అన్ని వార్తా పత్రికల్లో వచ్చిందే. కానీ... అసలు అక్కడ ఏం జరిగింది? అనేది చాలామందికి తెలీదు. విషయం ఏంటంటే... శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మాసాబ్ ట్యాంక్ కు దారితీసే పీవీ నరసింహారావు ఎక్స్ ప్రెస్ హైవేపై రాజశేఖర్ కారులో వెళ్తున్నాడు. అయితే... అనుకోకుండా... రాజశేఖర్ కారు... రాంరెడ్డి అనే వ్యక్తి ఇన్నోవాను ఢీ కొట్టింది. దాంతో ఇద్దరి మధ్యా వాగ్వివాదం జరిగింది. మందు తాగి డ్రైవ్ చేయడం వల్లే.. ఇలా అయ్యిందని రాంరెడ్డి గొడవకు దిగాడు. ‘నేను మందు తాగలేదు’ అని రాజశేఖర్ ఎంత చెప్పినా ఆయన వినలేదు. ‘మందు తాగలేదు అనొద్దు. ఆ విషయం తేల్చాల్సింది పోలీసులు’ అంటూ రాజశేఖర్ ని మాటలతోనే ఇబ్బందిపెట్టాడు. ఇక చేసేది లేక ‘చూడండీ... తప్పు నాది. నన్ను తిట్టాలనుంటే తిట్టండి. పక్కనే నిల్చుంటాను’ అని ఆ పక్కనే నిల్చున్నారు రాజశేఖర్.
అంతపెద్ద హీరో అలా మాట్లాడేసరికి రాంరెడ్డి కాస్త తగ్గినట్టు కనిపించాడు. అప్పుడు రాజశేఖర్ ‘నేను తాగలేదండీ.. మైండ్ డిస్ట్రబడ్ గా ఉంది. దాంతో ఇలా పొరపాటున జరిగిపోయింది. క్షమించాలి’ అని వివరణ ఇచ్చాడు. అయినా రాంరెడ్డి తగ్గలేదు. ‘ఒక హీరో రాజశేఖర్గా మీపై నాకు గౌరవం ఉంది. కానీ... ఈ పరిణామానికి బాధ్యులెవరు? మీరు శిక్షార్హులా కాదా? చెప్పండి. ప్రమాదం చిన్నది కాబట్టి సరిపోయింది. అదే పెద్దదయితే. ఏ చిన్న ఫ్యామిలీకో ఇలా జరిగితే. జరగకూడనిదేమైనా అయితే.. బాధ్యత ఎవరు? మైండ్ డిస్టబడ్ గా ఉందని చెబుతారా?’ అని నిలదీశాడట. రాజశేఖర్ తల వంచుకొని ‘మీ ఇష్టం. మీకు ఏది న్యాయమనిపిస్తే అది చేయండి. తప్పు నాదే. మీరు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అడ్డుపడను’ అని హూందాగా వ్యవహరించారట. దాంతో పోలీసులు రావడం, రాజశేఖర్ కి డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించడం జరిగింది. అయితే.. ఆ పరీక్షలో రాజశేఖర్ మద్యం సేవించి లేరని తేలడం గమనార్హం. వెంటనే రాంరెడ్డికి రాజశేఖర్ నష్టపరిహారం చెల్లించడంతో గొడవ సద్దుమణిగింది.
ఇదిలావుంటే... రాజశేఖర్ సతీమణి జీవిత.. ఈ వ్యవహారంపై మీడియాతో స్పందించారు. ‘నా భర్తకు జరిగిన చిన్న ప్రమాదం వల్ల.. మాపై ఎంతమంది అభిమానాన్ని పెంచుకొని ఉన్నారో తెలిసింది. క్షేమ సమాచారం కోసం ఫోన్లు చేసిన అభిమానులందరికీ కృతజ్ఙతలు. ఆయన మద్యం తాగి కారు నడపలేదు. ఆయన అలా చేయరు కూడా. పోలీసుల దర్యాప్తులో అది తేటతెల్లమైంది. రాజశేఖర్ గారి మనసు బాగాలేదు. అందుకే ఇలా జరిగింది. ఇక నుంచి నా భర్తను ఒంటరిగా కారు నడపనీయను. గొడవ సమసిపోయింది కాబట్టి... మీడియా కూడా సంయమనం పాటింలి’ అని చెప్పుకొచ్చారు.