ఘంటసాల సంగీతం సమకూర్చిన తొలి చిత్రం 'మనదేశం' కాదు!
on Dec 3, 2020
లెజెండరీ సింగర్ ఘంటసాల వేంకటేశ్వరరావు గొప్ప సంగీత దర్శకుడనే విషయమూ తెలిసిందే. సాధారణంగా అందరూ ఆయన సంగీతం సమకూర్చిన తొలిచిత్రం, ఎన్టీఆర్ నటుడిగా పరిచయమైన మనదేశం (1949) అని అనుకుంటూ ఉంటారు. కానీ ఆ సినిమా కంటే ముందే ఆయన రెండు చిత్రాల్లో పాటలకు బాణీలు అందించారు. ఆ సినిమాలు.. 'లక్ష్మమ్మ' (1950), 'బాలరాజు' (1948). లక్ష్మమ్మ సినిమాకు తొలిగా ఆయన పనిచేశారు. ఆ సినిమాకు సంగీత దర్శకుడు బాలాంత్రపు రజనీకాంతరావు. అయితే అందులోని రెండు పాటలకు ఘంటసాల ట్యూన్ కట్టారు. టైటిల్స్లో ఆయన పేరును "జి.వి. రావు" అని వేశారు. ఆ సినిమా ఆలస్యంగా 1950లో విడుదలైంది.
అలాగే అక్కినేని నాగేశ్వరరావును స్టార్ను చేసిన 'బాలరాజు'లో ఘంటసాల మూడు పాటలకు స్వరాలు కూర్చారు. దాని సంగీత దర్శకుడు గాలి పెంచల నరసింహారావు. ఆయన సహాయకుడిగా టైటిల్స్లో "జి.వి. రావు" పేరును మనం చూడొచ్చు. అంటే మొదట ఘంటసాల పేరును టైటిల్స్లో అలా వేశారన్న మాట. 'బాలరాజు'లోని "తీయని వెన్నెల రేయి", "తేలీ చూడుము హాయి", "నవోదయం" అనే పాటలకు ట్యూన్స్ కట్టారు ఘంటసాల. 'మనదేశం'తో ఆయన పూర్తి స్థాయి సంగీత దర్శకుడిగా మారారు. ఆ సినిమాతో పాటు ఆ వెంటనే వచ్చిన 'కీలుగుఱ్ఱం' సినిమా కూడా మ్యూజికల్గా పెద్ద హిట్టవడంతో ఇటు గాయకుడిగానే కాకుండా, అటు మ్యూజిక్ డైరెక్టర్గానూ ఘంటసాల గ్రేట్ అనిపించుకున్నారు. అన్నట్లు డిసెంబర్ 3 ఘంటసాల జయంతి.
Also Read