కరోనాపై ఫైట్: పోటెత్తిన టాలీవుడ్ విరాళాలు
on Mar 26, 2020
నందమూరి తారకరామారావు, అక్కినేని నాగేశ్వరరావు నుండి ఈతరం తారల వరకూ... తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఎప్పుడూ ప్రజల పక్షమే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి ఉభయ తెలుగు రాష్ట్రాలుగా ఏర్పడిన ప్రస్తుత కాలం వరకూ తెలుగు ప్రజలకు ఎప్పుడు ఏ ఆపద ఏర్పడినా మేము సైతం అంటూ ప్రజలకు తెలుగు సినిమా ఇండస్ట్రీ ప్రముఖులు సహాయ సహకారాలు అందించడానికి ముందడుగు వేశారు.
ప్రస్తుతం కరోనా కారణంగా జన జీవనం స్తంభించింది. ఈ కరోనాపై యుద్ధానికి తెలుగు సినీ ప్రముఖులు తమవంతు సహాయం అందించారు. తమిళ హీరోలు రజనీకాంత్, విజయ్ సేతుపతి, సూర్య-కార్తీ ఫ్యామిలీ, శివ కార్తికేయన్ రెండు రోజుల క్రితమే విరాళాలు ఇచ్చారు. జాగ్రత్తలు తప్ప సహాయ సహకారాలు ధన సహాయం చేయని హీరోలపై తెలుగు ప్రేక్షకులు మండిపడ్డారు. కాస్త ఆలస్యమైనప్పటికీ... కోట్ల రూపాయలను తెలుగు హీరోలు విరాళాలుగా ఇవ్వడం అభినందించదగ్గ విషయం. ఉదయం పవన్ కళ్యాణ్ మొదలుపెడితే... సాయంత్రం జూనియర్ ఎన్టీఆర్ వరకూ పలువురు ప్రముఖులు విరాళాలు అందించారు. ఎవరు ఎంతెంత ఇచ్చారనేది ఒకసారి చూద్దాం...
జనసేనాని, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - రూ. 2 కోట్లు
రెండు కోట్ల రూపాయల్లో ప్రధాని సహాయనిధికి కోటి అయితే... ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ. 50 లక్షలు, తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి మరో రూ. 50 లక్షలు ఇస్తున్నట్టు తెలిపారు.
కేంద్ర మాజీ మంత్రి, మెగాస్టార్ చిరంజీవి - కోటి రూపాయలు
కరోనా మహమ్మారితో ఒక్కసారిగా ఉపాధి కోల్పోయిన సినీ కార్మికుల సంక్షేమం కోసం కోటి రూపాయల విరాళాన్ని మెగాస్టార్ చిరంజీవి ప్రకటించారు.
సూపర్ స్టార్ మహేష్ బాబు - కోటి రూపాయలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయనిధి, తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి కలిపి రూ. కోటి ఇస్తున్నట్టు తెలిపారు.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ - కోటి రూపాయలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయనిధి, తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి కలిపి రూ. కోటి ఇస్తున్నట్టు తెలిపారు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ - రూ. 75 లక్షలు
75 లక్షల రూపాయల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ. 25 లక్షలు, తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి మరో రూ. 25 లక్షలు, మిగతా రూ. 25 లక్షలను తెలుగు సినీ కార్మికుల సంక్షేమానికి ఇవ్వనున్నట్టు తెలిపారు.
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ - రూ. 70 లక్షలు
ప్రధాని సహాయ నిధితో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి కలిపి రూ. 70 లక్షలను ఇస్తున్నట్టు తెలిపారు.
హీరో నితిన్ - రూ. 20 లక్షలు
తెలుగు సినిమా ఇండస్ట్రీలో అందరి కంటే ముందు స్పందించిన హీరో నితిన్. తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావును కలిసిన ఆయన ముఖ్యమంత్రి సహాయనిధికి 10 లక్షల రూపాయల చెక్ అందజేశారు. ఏపీ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ. 10 లక్షల విరాళం ప్రకటించారు.
దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ - రూ. 20 లక్షలు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధికి చెరో రూ.10 లక్షల చొప్పున విరాళం అందజేస్తానని వెల్లడించారు.
'దిల్' రాజుకి చెందిన వెంకటేశ్వర క్రియేషన్స్ - రూ. 20 లక్షలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.10 లక్షలు, తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి మరో రూ. 10 లక్షలు ఇస్తున్నట్టు తెలిపారు.
సాయి ధరమ్ తేజ్ - రూ. 10 లక్షలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయనిధికి, తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి కలిపి రూ. 10 లక్షలు ఇస్తున్నట్టు తెలిపారు.
దర్శకుడు కొరటాల శివ - రూ. 10 లక్షలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.5 లక్షలు, తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి మరో రూ. 5 లక్షలు ఇస్తున్నట్టు తెలిపారు.
దర్శకుడు అనిల్ రావిపూడి - రూ. 10 లక్షలు
తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రుల సహాయనిధులకు చెరో ఐదు లక్షల రూపాయలు ఇవ్వనున్నట్టు తెలిపారు.
'అల్లరి' నరేష్ & 'నాంది' నిర్మాత సతీష్ వేగేశ్న - రూ. 5 లక్షలకు పైగా
ప్రస్తుతం 'నాంది' అని ఒక సినిమా చేస్తున్నారు 'అల్లరి' నరేష్. ఆ సినిమా యూనిట్ లో రోజువారీ వేతనంతో పనిచేసే కార్మికులు సుమారు 50 మందికి పైగా ఉన్నారు. నిర్మాత సతీష్ వేగేశ్నతో కలిసి ఒకొక్కరికీ పదివేల రూపాయల చొప్పున ఇవ్వాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు.
దర్శకుడు వీవీ వినాయక్ - రూ. 5 లక్షలు
'మనం సైతం' స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడు, నటుడు కాదంబరి కిరణ్ కు వీవీ వినాయక్ రూ. 5 లక్షలు ఇచ్చారు. పేద సినీ కార్మికులకు నిత్యావసర వస్తువులు అందజేయమని కోరారు.
రాజశేఖర్ ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా 200మంది నిరుపేద కళాకారులకు రాజశేఖర్ నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. మరో రెండు వందల మందికి త్వరలో అందజేయనున్నట్టు తెలిపారు.
Also Read