తేజ డైరెక్ట్ చేసిన వాటిలో టాప్ 3, వరస్ట్ 3 మూవీస్.. ఆయన దృష్టిలోనే!
on Sep 15, 2020
డైరెక్టర్ తేజ మాటలు వింటే కోటలు దాటుతున్నట్లుంటాయి అనేది ఫిల్మ్నగర్ వాసుల్లో ఉన్న సాధారణాభిప్రాయం. అంటే మాటల్లో చెప్పినంతగా చేతలు ఉండవని అన్నమాట. 2000 సంవత్సరంలో సినిమాటోగ్రాఫర్ నుంచి డైరెక్టర్గా మారిన ఆయన ఈ ఇరవై ఏళ్ల కాలంలో 17 సినిమాలు డైరెక్ట్ చేస్తే, వాటిలో హిట్టయినవి నాలుగంటే నాలుగే! తొలి సినిమా 'చిత్రం'తోటే హిట్ కొట్టిన తేజ తీసిన తొలి ఐదు సినిమాల్లో మూడు హిట్టయ్యాయి. మూడో సినిమా 'నువ్వు నేను', ఐదో సినిమా 'జయం' ఒక దాన్ని మించి ఒకటి బ్లాక్బస్టర్ అయ్యాయి.
వాటిలో 'నువ్వు నేను' చిత్రాన్ని వెంటనే హిందీలో 'యే దిల్' పేరుతో రీమేక్ చేశాడు కానీ వర్కవుట్ కాలేదు. ఆ హిందీ చిత్రాన్ని పక్కనపెడితే, తెలుగులో తీసిన వరుస నాలుగు సినిమాల్లో మూడు హిట్టన్న మాట. ఆ తర్వాత తేజకు హిట్ దక్కింది పదహారో సినిమాతో! అది రానా, కాజల్ అగర్వాల్ జంటగా రూపొందించిన 'నేనే రాజు నేనే మంత్రి'.
అయితే తేజకు తను డైరెక్ట్ చేసిన వాటిలో టాప్ త్రీ సినిమాలు ఏవంటే ఒక ఫ్లాప్ సినిమా పేరును కూడా చేరుస్తాడు. ఆయన ఎంచిన టాప్ 3 ఫిలిమ్స్.. చిత్రం, నిజం, నేనే రాజు నేనే మంత్రి. వీటిలో 'నిజం' మూవీ బాక్సాఫీస్ దగ్గర హిట్ కాలేదు. అయితే హీరోగా నటించిన మహేశ్కు బెస్ట్ యాక్టర్గా నంది అవార్డ్ను ఆ సినిమా తీసుకొచ్చింది.
మరి.. తను తీసిన వాటిలో వరస్ట్ త్రీ సినిమాలను కూడా ఆయన ఎంచాడు. అవి.. ధైర్యం, హోరా హోరీ, వేయి అబద్ధాలు. వీటిలో నితిన్తో తీసిన 'ధైర్యం' సినిమాని ఇంతవరకూ ఆయన చూడలేదు. సినిమా సంగతి పక్కనపెట్టండి.. అసలు ఫస్ట్ కాపీయే చూడలేదంట. సినిమా తీసేటప్పుడే అది ఆడదని అర్థమైపోయిందంట. అదీ విషయం.
Also Read