పూరికి అందరూ దూరమైపోయినట్టేనా??
on Oct 22, 2016
అతి తక్కువ సమయంలోనే పాతిక సినిమాలు తీసిన సూపర్ ఫాస్ట్ డైరెక్టర్ పూరి జగన్నాథ్. మూడు నెలల్లో ఓ సినిమా పూర్తయిపోవాలి అని ఏ హీరో ఫిక్సయినా గానీ, వాళ్లకు పూరి జగన్నాథ్ బెస్ట్ ఆప్షన్లా కనిపిస్తుంటాడు. పూరి కూడా.. క్వాలిటీ మేకింగ్తో తక్కువ సమయంలో సినిమా తీసి సెభాష్ అనిపించుకొన్నవాడే. అందుకే పూరితో సినిమా అంటే స్టార్ హీరోలంతా ఉత్సాహం చూపిస్తుంటారు. అందరు స్టార్ హీరోలతోనూ పూరి అలాంటి రాపోని కొనసాగించాడు కూడా. అందుకే.. సీజన్లో ఒక్క స్టార్ హీరోతో అయినా సినిమా చేస్తూ.. పూరి దర్శకుడిగా తన స్టార్ డమ్ని కాపాడుకొంటూ వచ్చాడు. మహేష్ బాబు, ఎన్టీఆర్, ప్రభాస్, పవన్ కల్యాణ్.. మరీ ముఖ్యంగా రవితేజతో హిట్లు కొట్టాడు పూరి. వాళ్లు కూడా పూరి ఎప్పుడంటే అప్పుడు సినిమాలు చేయడానికి ముందుకొచ్చేవారు. అయితే.. గత కొన్నేళ్లుగా తనపై పెట్టుకొన్న నమ్మకాన్ని పూరి వమ్ము చేసుకొంటూ వస్తున్నాడు. మెల్లమెల్లగా ఒక్కో హీరోకీ దూరం అవుతున్నాడు. తాజాగా ఇజం ఫ్లాప్ తో పూరి దాదాపుగా హీరోలకు దూరంగా ఒంటరివాడైపోయాడు. ఇజం ఎఫెక్ట్ మొదట పడింది.. ఎన్టీఆర్పైనే. ఎన్టీఆర్ - పూరి కాంబోపై జనాలు ఆశలు వదులుకొన్నట్టైంది. మహేష్ బాబు కోసం పూరి ఓ కథ రెడీ చేశాడు. జనగణమన పేరుతో. ఆ సినిమాకి మహేష్ పుల్స్టాప్ పెట్టేశాడు. కథ నచ్చినా.. మహేష్ నుంచి ఎలాంటి స్పందన రావడం లేదని పూరి కూడా స్వయంగా వెల్లడించడంతో జనగణమన ఆగిపోయినట్టే. ఇక పవన్ - పూరి కాంబో మరోసారి తెరకెక్కడం అసాధ్యం. కెమెరామెన్ గంగతో రాంబాబు సమయంలో పవన్ - పూరి మధ్య విబేధాలు తలెత్తడమే అందుకు కారణం. ఇక మిగిలింది రవితేజ మాత్రమే. రవితేజ కెరీర్ బాగా స్లో అయ్యింది. తనకి సినిమాలు చేసే మూడ్ లేదని స్వయంగా పూరినే చెబుతున్నాడు. చేస్తే గీస్తే రవితేజ - పూరి కాంబోనే చేయాలి.కానీ.. ఇది సెట్స్పైకి వెళ్లడం కూడా ఇప్పట్లో సాధ్యమయ్యే విషయంగా కనిపించడం లేదు. సో.. పూరి తన హీరోలందరికీ దూరమైనట్టే. ఇక కొత్తవాళ్లతో బండి లాగించాలి.